Congress: 


ఎప్పటి నుంచో అధిష్ఠానంపై అసంతృప్తి


కాంగ్రెస్ పార్టీ ఇంతలా డౌన్‌ఫాల్ అవడానికి కారణం..అంతర్గత కలహాలు. తమకు పార్టీలో ప్రాధాన్యతే లేదని సీనియర్లు ఎప్పటి నుంచో అలక వహిస్తూనే ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా..ఎందుకో అది వర్కౌట్ అవటం లేదు. తరచూ ఇది కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి అది బయటపడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ ఎప్పటి నుంచో అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ఆయన చేసిన పని, ఆయనలోని అసహనాన్ని తెలియజేసింది. జమ్ముకశ్మీర్‌లో పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్‌గా గులాం నబీ ఆజాద్‌ను నియమించింది అధిష్ఠానం. ఇలా నియమించిన కాసేపటికే ఆ పదవికి రాజీనామా చేశారాయన. అంతే కాదు. జమ్ముకశ్మీర్ పొలిటికల్ అఫైర్స్‌ కమిటీ నుంచి కూడా తప్పుకున్నారు. రెండేళ్ల క్రితం పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ప్రక్షాళణ అవసరం అని అందులో తేల్చి చెప్పారు. సోనియాకు లేఖ రాసిన వారిలో గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. ఆయనే కాదు. గత నెల జమ్ము కశ్మీర్ పార్టీ చీఫ్ పదవి నుంచి గులాం అహ్మద్ మీర్ నుంచి తప్పుకున్నారు. గులాం అహ్మద్, గులాం నబీ ఆజాద్ మంచి మిత్రులు. ఈ ఇద్దరు మిత్రులు వరుసగా కీలక పదవుల నుంచి తప్పుకోవటం అధిష్ఠానాన్ని కలవర పెడుతోంది. 


ఎన్నికలు జరిగేది అప్పుడే 


జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకున్న మీర్‌ రాజీనామాకు అధిష్ఠానం ఆమోదించింది. ఆయన స్థానంలో వికర్ రసూల్‌ వనీని నియమించింది. జమ్ము కశ్మీర్‌లో క్యాంపెయిన్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, కో ఆర్డినేషన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, డిసిప్లీనరీ కమిటీలకు అధ్యక్షుడిగా రసూల్‌ వనీని నియమిస్తున్నట్టు కాంగ్రెస్ స్పష్టం చేసింది. జమ్మూలోని రంబన్ జిల్లాలో బనిహాల్ టౌన్‌షిప్‌ వాసి..ఈ వికర్ రసూల్ వనీ. రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 2009-14 మధ్య కాలంలో ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో నడిచిన నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. అటు కేంద్రం..జమ్ము కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తైన వెంటనే...ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. నవంబర్ 25 నాటికి పూర్తి స్థాయిలో జమ్ముకశ్మీర్‌లోని ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యం పెట్టుకుంది. ఇది అధికారికంగా పూర్తయ్యాక..కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఎలక్షన్స్ నిర్వహించేందుకు అవకాశముంటుంది. అప్పటి వరకూ లోయలో రాజకీయాలు ఎలా మారతాయో మరి! 


Also Read: KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్


Also Read: Sri Krishna Tatvam : శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం