Free Breakfast to Voters: మధ్యప్రదేశ్‌లో కొంత మంది షాప్ ఓనర్స్ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఉదయమే వచ్చి ఓటు వేసిన వాళ్లకి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఐస్‌క్రీమ్‌లు అందజేశారు. ఇండోర్‌లో 56 Dukaan అసోసియేషన్ ఈ ఆఫర్‌ ఇచ్చింది. పోలింగ్ శాతం పెంచేందుకు ఇలా వినూత్నంగా ఆలోచించింది. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న ఓటర్లు షాప్‌ల వద్ద క్యూ కట్టారు. వచ్చిన వాళ్లందరికీ ఉచితంగా టిఫిన్‌, ఐస్‌క్రీమ్ పెట్టి పంపించారు షాప్ ఓనర్లు. 


"ఇండోర్‌లో ఎప్పుడూ పోలింగ్ శాతం సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. ఈ సారి కూడా ఆశించిన స్థాయిలో నమోదు కావాలని భావించాం. అందుకే ఉదయమే వచ్చి ఓటు వేసిన వారికి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ అందించాం. ఉదయం 7-9 గంటల మధ్యలో ఈ ఆఫర్ అందించాం. ఇండోర్‌లో ఫేమస్ అయిన పోహా, జిలేబీ అందరికీ సర్వ్ చేశాం"


- షాప్ ఓనర్






ఓటర్లలో చైతన్యం పెంచేందుకు, వాళ్లు ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ పెట్టినట్టు ఓనర్లు వెల్లడించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ దాదాపు 5-6 వేల మందికి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ పెట్టామని చెప్పారు. ఈసారి ఏకంగా 11-12 వేల మందికి అందించామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌లో కొన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తరవాత ఏప్రిల్ 26న రెండో దశ, మే 7 మూడో దశ పోలింగ్ ముగిసింది. ఇవాళ్టితో (మే 13) ఇక్కడ మొత్తం 29 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.