Violence in UP: రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కారు.. ఎనిమిది మంది మృతి!

ABP Desam   |  Murali Krishna   |  04 Oct 2021 01:56 AM (IST)

ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త సాగు చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతులపైకి కేంద్ర మంత్రి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లకింపూర్‌ ఖేరీ జిల్లాలో హింస చెలరేగింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు మరణించగా పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఏం జరిగింది?

కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా లకింపూర్ ఖేరీ జిల్లాల్లోని టికోనియా-బందిపుర్ రహదారిపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తోన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ ఆ రైతుల మీదకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మంది వరకు మరణించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

ప్రమాదం జరిగిన అనంతరం వేలమంది రైతులు ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే ఈ ప్రమాదానికి కారణమని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు.. కేంద్ర మంత్రి కుమారిడి వాహనం సహా మరో వాహనానికి నిప్పుపెట్టారు.

కాంగ్రెస్ విమర్శలు..

ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో రైతులను భాజపా ఇంకెంత ద్వేషిస్తుంది? వాళ్లకి జీవించే హక్కు లేదా? గళం విప్పితే.. వాళ్లను కాలుస్తారా? కార్లతో తొక్కించి చంపేస్తారా? ఇక చాలు.. ఇది రైతుల దేశం.. భాజపాది కాదు. ఈ ఘటన తర్వాత రైతులు మరింతగా పోరాడతారు.                  -   ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

ఇలాంటి దారుణ ఘటనలు చూసి కూడా స్పందించకపోతే వాళ్లు చనిపోయినట్లే. ఈ త్యాగాలని వృథా కానివ్వబోం. -                     రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at: 03 Oct 2021 08:27 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.