Feminists Criticize Chandrababu Population Policy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన సరికొత్త జనాభా విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాజిక, రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. భవిష్యత్తులో యువ శ్రామిక శక్తి కొరత ఏర్పడకూడదనే ఉద్దేశంతో ఎక్కువ మంది పిల్లలను కనే దంపతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు 3వ బిడ్డకు రూ.30 వేలు, 4వ బిడ్డకు రూ.40 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనపై మహిళా సంఘాలు మరియు ఫెమినిస్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళల శరీరం, ఆరోగ్యం వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మహిళలను పిల్లలను కనే యంత్రాలు గా పరిగణించడం ఏమాత్రం సమంజసం కాదని వారు మండిపడుతున్నారు.
వైద్య నిపుణుల ఆందోళన
ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ శివరంజని సంతోష్ ఈ పాలసీపై సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే రూ.30,000 లేదా రూ.40,000 సాయం కొద్ది రోజుల్లోనే ఖర్చయిపోతుందని, ఆ తర్వాత ఆ బిడ్డల పోషణ, చదువు, ఆరోగ్య బాధ్యతలను పేద కుటుంబాలు ఎలా మోస్తాయని ఆమె ప్రశ్నించారు. కేవలం తాత్కాలిక నగదు ఆశ చూపి పేదలను ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చేలా ప్రోత్సహించడం వారిని మరిన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టడమేనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు లేని చోట జనాభా పెంపు శిశు, మాతృ మరణాల రేటును పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మాజీ హెల్త్ సెక్రటరీ పీవీ రమేశ్ వ్యతిరేకత
మాజీ హెల్త్ సెక్రటరీ పీవీ రమేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం జనాభా సంఖ్యను పెంచడం కంటే, ప్రస్తుతం ఉన్న జనాభాకు నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం, పౌష్టికాహారం అందించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఇంకా పూర్తిస్థాయిలో బలోపేతం కాకముందే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తల్లుల ఆరోగ్య భద్రత ప్రమాదంలో పడుతుందని ఆయన విశ్లేషించారు. నాణ్యమైన మానవ వనరుల అభివృద్ధికి సంఖ్య కంటే సౌకర్యాలు ముఖ్యమని ఆయన కోణంలో స్పష్టం చేశారు.
జాతీయ స్థాయిలో సెగ ఈ అంశంపై పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, సినీ నటి పూనమ్ కౌర్ వంటి వారు కూడా తమ గళాన్ని వినిపించారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు వ్యాఖ్యలను కొందరు దూరదృష్టి గా అభివర్ణిస్తుంటే, మరికొందరు దీనిని మహిళా వ్యతిరేక ధోరణి గా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు ఈ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సీఎం ఈ ప్రతిపాదన చేసినప్పటికీ, అది మహిళల ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలా ఉండకూడదని వారు వాదిస్తున్నారు.
సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా చంద్రబాబు పాపులేషన్ పాలసీని ఖండించారు చంద్రబాబు ఎన్డీయేలో చేరిన తర్వాత సొంత తెలివితేటలను, ఆలోచనా విధానాన్ని తాకట్టు పెట్టేంత దూరంగా వెళ్ళిపోయారా అని ప్రశ్నించారు. రూ. 30,000 ఆశ చూపి, ఒక మహిళకు తన సొంత గర్భంపై ఉన్న ప్రాథమిక హక్కును మీరు లాక్కోవాలని చూస్తున్నారు... ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ రూ. 30,000 - రూ. 40,000 ఆశకు లోబడి, ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమెపై విపరీతమైన ఒత్తిడి తెస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
భవిష్యత్ సంక్షోభం తలెత్తకుండానే అని సమర్థ న మరోవైపు, చంద్రబాబు మద్దతుదారులు మాత్రం ఈ పాలసీని సమర్థిస్తున్నారు. ప్రభుత్వం ఎవరినీ బలవంతం చేయడం లేదని, కేవలం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి ప్రోత్సాహం అందిస్తోందని వారు చెప్తున్నారు. రాబోయే దశాబ్దాల్లో ఏపీలో వృద్ధాప్య సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే ఇప్పుడే మేల్కొనాలని, జనాభా సంతులనం కోసమే ఈ పాలసీని వర్కవుట్ చేస్తున్నారని వారు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా, ముఖ్యమంత్రి లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్గా మారి, భిన్నమైన వాదనలకు దారితీస్తోంది.
