Fatal road accident in UP : ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లాలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఒక రోడ్డు ప్రమాదం దృశ్యాలు వైరల్ గా మారాయి. కలప పొట్టు లోడ్ తో వెళ్తున్న ఒక భారీ ట్రక్కు, విద్యుత్ శాఖకు చెందిన ప్రభుత్వ బొలెరో వాహనంపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బొలెరో నుజ్జునుజ్జు అవ్వడమే కాకుండా, అందులో ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
అసలేం జరిగింది?
నైనిటాల్ హైవేపై పహాడీ గేట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్ కు చెందిన బొలెరో వాహనం ఒక మలుపు వద్ద టర్న్ తీసుకుంటోంది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రక్కు, బొలెరోను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. ట్రక్కుపై లోడ్ ఎక్కువగా ఉండటం , బ్యాలెన్స్ తప్పడంతో అది పక్కనే ఉన్న బొలెరోపై కుప్పకూలింది.
పొట్టులో కూరుకుపోయిన డ్రైవర్
ప్రమాదం జరిగిన తీరు ఎంత భయానకంగా ఉందంటే వేల కిలోల పొట్టు ట్రక్కు బరువుకు బొలెరో పూర్తిగా నలిగిపోయింది. వాహనంలో ఉన్న డ్రైవర్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు క్రేన్లు, జేసీబీలను ఉపయోగించి సుమారు గంటన్నర పాటు శ్రమించి ట్రక్కును పక్కకు తొలగించారు. ఆ తర్వాత బొలెరోను కోసి లోపల ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికితీశారు.
ట్రక్కులో పరిమితికి మించి కలప పొట్టును లోడ్ చేయడం వల్ల మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. హైవే కట్ వద్ద వాహనాలు మలుపు తిరుగుతున్నప్పుడు వేగాన్ని నియంత్రించకపోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. రాంపూర్ ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన కారణంగా హైవేపై దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.