EPFO Higher Pension: ప్రైవేటు రంగంలో అధిక పింఛన్ పొందేందుకు అర్హులైన వారికి ఈపీఎఫ్ఓ షాక్ ఇచ్చింది. వేతన జీవులకు దామాషా పద్ధతిలో పార్టు 1, పార్టు 2 విధానం కింద పింఛను లెక్కించి ఇవ్వాలని తాజాగా నిర్ణయించింది. ఇదే విషయాన్ని ప్రకటించడంతో ఆశావాహులు అంతా తీవ్ర స్థాయిలో డీలా పడిపోయారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్ల సమావేశంలో రవుర్కెలా ప్రాంతీయ కార్యాలయం ఇచ్చిన డిమాండ్‌ నోటీసులో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టు 1, పార్టు 2 కింద పింఛను లెక్కించి ఇవ్వాలని ఆదేశించింది. అయితే అదే పద్ధతిని అంతా అనుసరించాలని, అధిక పింఛనుకు అర్హులైన వారికి పింఛను చెల్లింపు ఆర్డర్లు జారీ చేయాలని సూచించింది. 1995 నవంబరు 16వ తేదీ నుంచి 2014 ఆగస్టు 31వ తేదీ వరకు చేసిన సర్వీసుకు చివరి ఏడాది వేతన సగటు తీసుకుని పార్ట్‌ 1 కింద లెక్కిస్తారు. అలాగే 2014 సెప్టెంబరు 1వ తేదీ నుంచి పదవీ విరమణ చేసిన నాటి వరకు చివరి ఐదేళ్ల వేతన సగటు తీసుకుని పార్ట్‌ 2 కింద గణించి ఆ రెండింటినీ కలిపి తుది పింఛను కింద ఖరారు చేయడమే... రెవుర్కెలా పద్ధతి.  


అధిక పింఛను లెక్కింపు ఫార్ములాపై ఈపీఎఫ్‌వో 2023 జూన్‌ ఒకటవ తేదీన స్పష్టత ఇచ్చింది. 2014 సెప్టెంబరు 1వ తేదీ నాటికి రిటైర్ అయిన వారికి చివరి ఏడాది వేతన సగటు ఆధారంగా లెక్కించాలని సూచించింది. 2014 సెప్టెంబరు ఒకటవ తేదీ తర్వాత పదవీ విరమణ చేసే వారికి చివరి 60 నెలల సగటు వేతనం ఆధారంగా లెక్కించాలని స్పష్టం చేసింది. ఈక్రమంలోనే రవుర్కెలా పద్ధతి అమలు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్‌వో స్పష్టం చేయడంతో పింఛను మొత్తం తగ్గిపోతుంది. అయితే అధిక పింఛన్ పొందే వాళ్లకు అర్హులైన వారు ఈపీఎస్ కు చెల్లించాల్సిన మొత్తంపై ఈపీఎఫ్‌వో డిమాండ్‌ నోటీసులు జారీ చేస్తుంది. నోటీసుల్లో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్న వారికి ప్రాంతీయ కార్యాలయాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. డీడీలు తీసుకుని వస్తే తిరస్కరిస్తున్నాయి. అయితే ఆ మొత్తాన్ని వారు పని చేస్తున్న యజమానికి ఇచ్చి యాజమాన్యం ద్వారా ఆన్‌ లైన్ లో చెల్లించాలని చెబుతున్నాయి. ఈ నిర్ణయంపై యాజమాన్యాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చెల్లింపులు చేస్తుంటే ఆదాయ పన్ను శాఖ, ఇతర న్యాయ సమస్యలు వస్తాయని పేర్కొంటున్నాయి. 


ఎవరైనా ఓ ఉద్యోగి ప్రైవేటు సంస్థలో 2000 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు అంటే 23 ఏళ్ల పాటు పని చేసి పదవీ విరమణ చేశారు. ఆ ఉద్యోగి చివరి ఐదేళ్ల వేతన సగటు రూ.40,000 గా ఉంది. అతనికి 2023 జూన్ ఒకటవ తేదీ నాటికి ఆదేశాల ప్రకారం నెలకు 13 వేల 142 రూపాయల పింఛను రావాలి. కానీ ఆ ఉద్యోగికి 2014 ఆగస్టు 31వ తేదీ నాటికి చివరి ఏడాది వేతన సగటు రూ.26 వేలు అనుకుంటే అప్పుడు అతని సర్వీసు కాలం 14 ఏళ్లు అవుతుంది. ఈ లెక్కన పార్టు 1 కింద పింఛను రూ.5,200 కాగా.. 2023 నాటికి మిగతా తొమ్మిది సంవత్సరాల సర్వీసుకు ఐదేళ్ల వేతన సగటు తీసుకుంటే పార్టు 2 కింద పింఛను రూ.5,142 అవుతుంది. ఈ లెక్కన పార్టు 1, పార్టు 2 కలిపి తుది పింఛను 10 వేల 342 అవుతుంది. అంటే దాదాపు 3000 వేల వరకూ తగ్గుతుంది.