Election Commission Notices to BJP: బీజేపీతో పాటు కాంగ్రెస్‌కి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం, విద్వేషపూరిత ప్రసంగం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11 గంటల లోగా దీనిపై వివరణ ఇవ్వాలని రెండు పార్టీలకూ నోటీసులు పంపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి నోటీసులిచ్చింది. 






ఈ నోటీసులు ఇచ్చే సమయంలో ఇద్దరు నేతల ప్రసంగాలపై అసహనం వ్యక్తం చేసింది. ఇవి తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదముందని వెల్లడించింది.


"రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అనుసరిస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అది పార్టీల బాధ్యత. ముఖ్యంగా స్టార్ క్యాంపెయినర్ల విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రసంగాలు ఇవ్వడం వల్ల తీవ్ర పరిణామాలకు దారి తీసే ప్రమాదముంది"


- ఎన్నికల సంఘం


ఆరోపణలివే..


ఏప్రిల్ 21వ తేదీన రాజస్థాన్‌లోని బన్స్వారాలో ప్రధాని మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా మండి పడింది. కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదనంతా దోచుకుని ముస్లింలకు పంచి పెడుతుందని ఆయన అన్నారు. అయితే...మోదీ ఆ తరవాత కూడా అదే తరహా వ్యాఖ్యలను కొనసాగించారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగింది. దేశంలో పేదరికం పెరిగిపోయిందంటూ చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ ఈసీకీ ఫిర్యాదు చేసింది. భాష, మతం పేరుతో దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాలకు చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారంటూ రాహుల్‌పై కంప్లెయింట్ ఇచ్చింది. ప్రధాని మోదీ కామెంట్స్ ఇప్పటికే రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఆ తరవాత కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా వారసత్వ పన్ను గురించి చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. 






Also Read: సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే