Avinash Reddy: పులివెందులలో పర్యటిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో తనపై తన పార్టీ అభ్యర్థి అవినాష్‌పై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈ కేసులో అవినాష్‌ ఎలాంటి తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే ఆయనకు టికెట్ ఇచ్చానని స్పష్టం చేశారు. ఈ కేసులో అవినాష్ ప్రమేయం ఉందన్న సునీత, షర్మిల కామెంట్స్‌కు ఇన్‌డైరెక్ట్‌ కౌంటర్ ఇచ్చారు. 


పసుపు మూకలతో చెల్లెమ్మలు చేతులు కలపారని ఆరోపించారు జగన్. తనను నేరుగా ఎదుర్కోలేక అంతా కలిసి ఒక్కసారి దాడి చేస్తున్నారని వాపోయారు. అందుకే వివేక హత్య కేసును తెరపైకి తీసుకొచ్చి అవినాష్‌ను టార్గెట్ చేశారని అన్నారు. అవినాష్‌ను నాశనం చేయాలని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 


పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ అవాక్కులు పేలుతున్నారని విమర్శించారు జగన్. అలాంటి సంస్కృతి తమకు లేదన్నారు జగన్. మంచి చేయడం  మంచికి అండగా నిలబడటమే తెలుసున్నారు. నాలుగు దశాబ్ధాలుగా టీడీపీ అక్రమాలను ఎదుర్కొంటి ఈ పులివెందుల బిడ్డలే అన్నారు. పులివెందుల అంటే అభివృద్ధికి, నమ్మకానికి నిదర్శనమని అన్నారు. ఇదో సక్సెస్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిని అభివృద్ధిని మరో రెండు అడుగులు ముందుకే తీసుకెళ్లామన్నారు. 


అలాంటి పులివెందులలో వైఎస్‌, జగన్ ముద్రలేకుండా చేయాలని కొందరు కుట్ర పన్నారన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి యత్నిస్తున్నారని అన్నారు. వారి కుట్రలో భాగంగానే కొందురు వైఎస్‌ వారసులమని ముందుకొస్తున్నారని సునీత, షర్మిలను ఉద్దేశించి విమర్శించారు. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాల్సింది, వైఎస్‌కు నిజమైన వారసులెవరో చెప్పాల్సింది ప్రజలే అన్నారు. అలాంటి ప్రజల్లో తనకు మంచి పేరు ఉందని దాన్ని తట్టుకోలేక తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి పచ్చ మూక కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. 


వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందెవరో... ఆయనపై కేసులు పెట్టిందెవోర... విగ్రహాలు తొలగిస్తామన్నదెవరో ప్రజలకు బాగా తెలుసున్న జగన్... అలాంటి వారితో చేతులు కలిపిన వ్యక్తులు వైఎస్‌ వారసులు ఎలా అవుతారని అన్నారు. పసుపు చీరలు కట్టుకొని వైఎస్‌ఆర్‌ శత్రువులతో చేతులు కలిపిన వారు వారసులా అని ప్రశ్నించారు. 


రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరు ఓటు వేస్తారని ప్రశ్నించారు. తమ ఓట్లు చీలిస్తే ఎవరికి ప్రయోజనమో గుర్తించాలని ప్రజలకు సూచించారకు. తన చిన్నాన్నను చెప్పింది ఎవరో దేవుడికి, జిల్లా ప్రజలకు బాగా తెలుసు అన్నారు జగన్. నిందితులకు ఎవరు మద్దతు ఇస్తున్నారని కూడా తెలుసు అన్నారు. వివేకాకు రెండో భార్య సంతానం ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడకు వెళ్లారో... పదే పదే మీడియాలో ఆయన సంధిస్తున్న ప్రశ్నలు నిజం కాదా అని నిలదీశారు. 


వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఆయనకు టికెట్ ఇచ్చానన్నారు. అలాంటి వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలని చూడటం బాధాకరమన్నారు. ఇలాంటి కుట్రలు చేయడానికి చెల్లెళ్లను ఎవరు పంపించారో ప్రజలకు బాగా అర్థమైందన్నారు. అన్యాయంగా నాడు ఎన్నికల్లో ఓడించిన వాళ్లే ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని... వారిచ్చిన స్క్రిప్టులనే వీళ్లు చదువుతున్నారని అన్నారు. అలాంటి వాళ్లు వైఎస్‌ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు.