Donations To Flood Victims In Telangana And Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వరద బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం.. సగానికిపైగా మునిగిపోయాయి. వేలాది మంది బాధితులు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాల్లో  ఉంటున్నారు. సర్వవ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. వారిని ఆదుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు... అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. బాధితులకు కావాల్సిన నిత్యావసరాలు, సరుకులు అందిస్తున్నాయి. మరోవైపు.. వరద  బాధితులను ఆదుకునేందుకు చాలా మంది విరాళాలు కూడా ఇస్తున్నారు. తమ స్థాయికి తగ్గట్టు సాయం అందిస్తున్నారు. ఆపత్కాల సమయంలో... అండగా నిలుస్తున్నారు. 


వెంకయ్యనాయుడు కుటుంబం ఎంత ఇచ్చారంటే..?
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వరదలపై...మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) వెంటనే స్పందించారు. రెండు రాష్ట్రాల సహాయనిధికి... తన పింఛన్‌ నుంచి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు..  ఆయన కుమారుడు హర్షవర్దన్‌ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్‌ తరపున ఏపీ, తెలంగాణకు రెండున్న లక్షల రూపాయల చొప్పున విరాళం అందజేశారు. అలాగే... వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌ నిర్వహిస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌  నుంచి కూడా రెండున్నర లక్షల రూపాయలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి పంపారు.


ఎవరెవరు ఎంత ఇచ్చారంటే..?
తెలంగాణ ఎమ్మెల్సీ తీర్మాన్‌ మల్లన్న... ఖమ్మం వరద ముంపు బాధితులకు తన నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ఉద్యోగులు కూడా వరద బాధితులకు సాయం అందించారు. ఒక రోజు వేతనాన్ని అంటే 100 కోట్ల రూపాయలను  స్వచ్ఛందంగా వరద సహాయ నిధికి ఇస్తున్నారు. తిరుమల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందిస్తారు. ఆహారం ప్యాకెట్లు తయారు చేసి... పంపుతున్నారు. సోమవారం (ఆగస్టు 2వ తేదీ) నాలుగు వేల మందికి బిర్యానీ,  పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను కిట్లుగా చేసి... విజయవాడ పంపారు. మంగళవారి (ఆగస్టు 3వ తేదీ) మరో 10వేల మందికి ఆహార పొట్లాలు పంపారు. ఇంకా చాలా మంది తమ ఉదారత చాటుకుంటున్నారు. వరద బాధితులకు తమ వంతు సాయం అందిస్తున్నారు.


తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విరాళం


తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వరద బాధితులకు అండగా నిలబడింది. ఇందులో భాగమైన ఉన్న ఉద్యోగుల ఒకరోజు బేసిక్ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఇది దాదాపుగా 130 కోట్ల రూపాయలు అవుతుంది. మహబూబ్‌బాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 130కోట్ల చెక్‌ను ఉద్యోగులు అందజేయనున్నారు. 




జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంత ఇచ్చారంటే..?
జూనియర్‌ ఎన్టీఆర్‌ (NTR) మరోసారి పెద్ద మనసు చూపించారు. వరద బాధితులకు భారీగా విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధతులకు కోటి రూపాయల విరాళం ఇచ్చినట్టు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వరద బీభత్సం తనను ఎంతో  కలచివేసిందన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు సహాయపడాలనే ఉద్దేశంతో ఏపీ, తెలంగాణ  ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తున్నానని పోస్టు పెట్టారు.


సినీ నటుల నుంచి విరాళాలు. 
నటుడు విష్వక్‌సేన్‌ (Vishwaksen) కూడా తన వంతు సాయంగా... 10 లక్షలు విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు 25 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నట్టు వైజయంతి మూవీస్‌(Vyjayanthi Movies) ప్రకటించింది. ఆయ్‌ సినిమా  బృందం (AAY Movie team) కూడా విరాళం ప్రకటించింది. సినిమా వసూళ్లలో నిర్మాత షేర్‌ నుంచి 25 శాతాన్ని జనసేన పార్టీ తరపున విరాళంగా అందజేయనున్నట్టు ప్రకటించింది.