భోజనం పెట్టలేదని భార్యపై దాడి, హత్య


ఈ రోజుల్లో నేరాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. మరీ సిల్లీ కారణాలకు కూడా చనిపోవటమో, చంపటమో చేస్తున్నారు కొందరు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దిల్లీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య తనకు డిన్నర్ వడ్డించలేదన్న కోపంతో హత్య చేశాడో భర్త. పైగా ఆమె శవాన్ని పక్కన పెట్టుకునే రాత్రంతా నిద్రపోయాడు. అసలు కథలోకి వెళ్తే..దక్షిణ దిల్లీలోని ఫతేపూర్‌ బెరి ప్రాంతంలో వినోద్ కుమార్, సోనాలి దంపతులు ఉంటున్నారు. ఇద్దరూ కలిసి ఈ నెల 16వ తేదీన రాత్రి పూట మందు తాగారు. అయితే వినోద్‌కి ఆకలి వేసి డిన్నర్ వడ్డించటమని భార్యని అడిగాడట. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంలో ఇద్దరికీ చాలా సేపు వాగ్వాదమైంది. ఆవేశం కంట్రోల్ చేసుకోలేని సోనాలి, భర్తపై చేయి చేసుకుంది. ఈ కోపంతో భార్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు వినోద్ కుమార్. తరవాత దిండుతో ముఖంపై ఒత్తిపట్టి హతమార్చాడు. ఆ రాత్రంతా అలాగే ఆమె శవం పక్కనే నిద్రపోయాడు. మద్యం మత్తు దిగాక కానీ తన భార్యను చంపేశానని అర్థం కాలేదు. వెంటనే ఇంట్లో ఉన్న రూ. 40 వేలు తీసుకుని పరారయ్యాడు వినోద్ కుమార్. 


శుక్రవారం ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినోద్ కుమార్, భార్యను తీవ్రంగా కొట్టాడని ఒకరు సాక్ష్యం చెప్పారు. ఈ ఆధారంగా పోలీలుసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టి చివరకు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఓ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. అందులో 43 వేల రూపాయలకు పైగా డబ్బు, రెండు లిక్కర్ బాటిల్స్, రక్తపు మరకలున్న దిండు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.