Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక వ్యక్తుల పేర్లు ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో దిల్లీ సీఎం  అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి  గురించి ప్రస్తావించింది. ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్లు ఛార్జిషీట్ లో ఈడీ తెలిపింది. కవిత ఆదేశాలతోనే అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ స్పష్టం చేసింది. 


దిల్లీ సీఎం పేరు


ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పుడు మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ...ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం...ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది ఆప్. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని తెలిపింది ఈడీ. మరో సంచలనం ఏంటంటే...చార్జ్‌షీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం 17 మంది నిందితులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది ఈడీ. మొదటి ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చిన ఈడీ... ఈసారి కేజ్రీవాల్ పేరునీ జోడించింది. 


సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు ప్రస్తావన 


దిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్ లో ఈడీ ఐదుగురిపేర్లు, ఏడు కంపెనీలను తాజాగా చేర్చింది. విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. సౌత్‌గ్రూప్‌ లావాదేవీల్లో  శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలకంగా వ్యవహరించారని తెలిపింది. ఈ ఛార్జిషీట్‌ ను ఈడీ కోర్టుకు సమర్చించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం 17 మంది పేర్లను రెండో ఛార్జిషీట్‌లో ఈడీ ప్రస్తావించింది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, దినేష్ అరోరాతో పాటు ముందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఈడీ ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. నవంబర్‌ 26న దిల్లీ లిక్కర్ స్కామ్ పై  3వేల పేజీలతో ఈడీ మొదటి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి కంపెనీలపై ఈడీ అభియోగాలు రికార్డు చేసింది.  


నిందితులకు బెయిల్ 


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు బెయిల్ మంజూరైంది. కుల్దీప్‌ సింగ్, నరేంద్ర సింగ్‌కు మధ్యంతర బెయిల్... ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌లకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రౌస్‌్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకు ఏడుగురిపై సీబీఐ ఛార్జిషీట్‌ వేసింది. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్టు. వ్యాపారవేత్తలు సమీర్ మహేంద్రు, ముత్త గౌతమ్, అరుణ్ పిళ్లైకు కూడా  బెయిల్ ఇచ్చింది. 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ గ్రాంట్ అయింది. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ జనవరి 24 వాయిదా వేసింది.  విచారణ సమయంలో ఇద్దర్నే అరెస్టు చేశామని ఐదురుగు నిందితులను అరెస్టు చేయలేదని కోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లికి ఇప్పటికే ట్రయల్ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇప్పుడు మిగిలిన నిందితులకు బెయిల్ ఇచ్చింది.