Manish Sisodia Arrest: 


కోర్టులో హాజరు 


ఢిల్లీ డిప్యుటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేయడం రాజకీయాలను వేడెక్కించింది. సీఎం కేజ్రీవాల్ ఊహించినట్టుగానే అరెస్ట్‌కు గురయ్యారు సిసోడియా. ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు CBI అధికారులు. అయితే...అంతకు ముందు మెడికల్ టెస్ట్‌లు చేశారు.  
ABP Newsకి అందిన సమాచారం ప్రకారం...ఉదయం 10 గంటలకే ఈ పరీక్షలు పూర్తయ్యాయి. CBI హెడ్‌క్వార్టర్స్‌లోనే ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక మిగిలింది కోర్టులో హాజరుపరచడమే. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చాన్నాళ్లుగా సిసోడియా పేరు వినిపిస్తోంది. ఆయనను 8.5 గంటల పాటు విచారించిన అధికారులు...ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సిసోడియా నిందితుడే అని అంటోంది సీబీఐ. అంతకు ముందే  ఓ సారి సమన్లు జారీ చేసి విచారించిన CBI..ఇటీవల మరోసారి నోటీసులు పంపింది. విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. అయితే...ఓ వారం రోజుల గడువు అడిగారు మనీశ్ సిసోడియా. బడ్జెట్ తయారీలో ఉన్నానని, ఆ పని పూర్తయ్యే వరకూ గడువు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు CBI విచారణ తేదీని మార్చింది. నిన్న (ఫిబ్రవరి 26) సాయంత్రం విచారణ పూర్తైన వెంటనే ఆయనను అరెస్ట్ చేసింది. తాము అడిగిన ప్రశ్నలకు సిసోడియా సరైన సమాధానాలు చెప్పలేదని, అందుకే అరెస్ట్ చేశామని వెల్లడించింది. ఆయన అరెస్ట్ అయిన తరవాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సిసోడియా ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


అయితే...సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నిందితుల జాబితాలో సిసోడియా పేరు లేదు. కానీ...కచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందని తేల్చి చెబుతోంది. సిసోడియా మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టి పారేస్తున్నారు. తన ఇంట్లోనూ, బ్యాంక్‌ లాకర్‌లోనూ తనిఖీలు చేశారని, కానీ వాళ్లకు ఏ ఆధారాలూ లభించలేదని తేల్చి చెప్పారు. ఢిల్లీ విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఈ అభివృద్ధిని ఆపేయాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఆరోపణలపై స్పందించారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదని తేల్చి చెప్పారు. ఇది కేవలం మనీశ్ సిసోడియాపై కుట్ర అని అన్నారు. ప్రస్తుతం సిసోడియా సీబీఐ విచారణకు హాజరైన క్రమంలో త్వరలోనే ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని కేజ్రీవాల్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. త్వరలోనే ఆయన జైలు నుంచి విడుదలవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ట్విటర్‌లో ఓ పోస్ట్ కూడా చేశారు.