Russia Ukraine:


పుతిన్ ప్రైవేట్ ఆర్మీ..


రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నాడో ప్రపంచమంతా గమనిస్తూనే ఉంది. అవసరమైతే అణు యుద్ధానికి సిద్ధమేననే సంకేతాలిచ్చాడు. అటు సైనిక నష్టం మాత్రం రెండు వైపులా భారీగా జరుగుతోంది. అయితే...ఓ రష్యన్ సైనికుడు ఇటీవలే ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఇది సహించని పుతిన్ ప్రైవేట్ ఆర్మీ...ఆ సైనికుడిని తీవ్రంగా హింసించింది. సుత్తితో కొట్టి చంపింది. 55 ఏళ్ల యెవ్‌గెనీ నుజిన్‌ ముఖంపై సుత్తితో దారుణంగా కొట్టి హత్య చేసినట్టు The Sun వార్తాపత్రిక వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన వీడియో కూడా అక్కడి మీడియాలో బాగా వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ సైన్యంలో చేరి..ఆ సైనికుడు రష్యాకు నమ్మకద్రోహం చేశాడన్న ఆగ్రహంతో ఈ హత్య చేసినట్టు సమాచారం. "రష్యా సైన్యంలో నాకు ప్రాధాన్యత దక్కలేదు. వాళ్లు నన్ను మరీ అవమానకరంగా చూశారు. ఉక్రెయిన్‌లో నా కుటుంబ సభ్యులు ఉంటారు. అందుకే ఉక్రెయిన్‌ సైన్యానికి లొంగిపోయి వాళ్ల కోసం పని చేయాలనుకున్నాను"అని ఆ సైనికుడు ఓ జర్నలిస్ట్‌కు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తరవాతే రష్యా సైనికులు ఆ సైనికుడిని కిడ్నాప్ చేసి ఇలా దారుణంగా హత్య చేశారు. రష్యన్ అయ్యుండి ఉక్రెయిన్ తరపున రష్యాతో పోరాటం చేయడమేంటని రగిలిపోయింది పుతిన్ ప్రైవేట్ ఆర్మీ. దాని పర్యవసానంగానే ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. 


లక్ష మంది రష్యన్ సైనికులు మృతి!


మొత్తం ఈ యుద్ధం కారణంగా..40 వేల మంది ఉక్రెయిన్ పౌరులు, లక్ష మంది రష్యా సైనికులు చనిపోయారని తెలుస్తోంది. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పటికే ఓ కీలక ప్రకటన చేశారు. రష్యాతో శాంతియుత చర్చలకు సిద్ధమేనని వెల్లడించారు. అయితే...ఇప్పటి వరకూ రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి వెనక్కు ఇచ్చేయాలన్న కండీషన్‌పైనే తాను చర్చలకు ముందుకొస్తానని వెల్లడించారు. 
ఖేర్సన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకున్న సమయంలోనే రష్యా ఓ ప్రకటన చేసింది. శాంతియుత చర్చలకు తామూ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. అయితే... ఖేర్సన్‌లో 20-30 వేల మంది రష్యా సైనికులున్నారని, ఉపసంహరణకు కొన్ని వారాల సమయం పట్టే అవకాశముందని అమెరికా చెబుతోంది. కేవలం తమ సైన్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతోనే రష్యా ఈ నిర్ణయం తీసుకుందని అగ్రరాజ్యానికి చెందిన ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా రష్యా మరోసారి సైన్యాన్ని ఎప్పుడైనా మొహరించే అవకాశముందని, కానీ...శాంతియుత చర్చలకు మాత్రం మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తున్నారు.


యుద్ధంలో 71,200 మంది రష్యా సైనికులు తమ చేతిలో చనిపోయారని ఉక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంటోంది. అయితే ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పశ్చిమ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తరచూ అణు దాడుల గురించి ప్రస్తావిస్తూ టెన్షన్ పెడుతున్న ఆయన...ఈసారి మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. ఖేర్సన్ నుంచి తమ బలగాలను వెనక్కి రప్పిస్తామని చెబుతూనే... అణుదాడుల గురించి చర్చించటం అంతర్జాతీయంగా అలజడి సృష్టిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మాట్లాడిన సందర్భంలో జపాన్‌పై జరిగిన అణుదాడుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు పుతిన్. ఇదే పశ్చిమ దేశాల నేతలను కలవరానికి గురి చేస్తోంది. 


Also Read: Vladimir Putin: పుతిన్‌కు ప్రాణభయం పట్టుకుంది, అందుకే అక్కడికి రావటం లేదు - బ్రిటీష్ వార్తాసంస్థ