Covid Guidelines: 


కొత్త మార్గదర్శకాలు


కరోనా జాగ్రత్తల్లో భాగంగా...కేంద్రఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ మరోసారి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 భారత్‌లోనూ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే నలుగురు ఈ వైరస్ బారిన పడ్డారు. కేంద్రం సహా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాపై యుద్ధానికి మరోసారి సిద్ధమయ్యాయి. ఈక్రమంలోనే అధికారులతో సమావేశం నిర్వహించిన ఆరోగ్య మంత్రి కీలక ఆదేశాలిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులకు పలు సూచనలు చేశారు. కరోనా మార్గదర్శకాలు విడుదల చేశారు. అన్ని రాష్ట్రాలకూ లేఖ కూడా రాశారు. రానున్న రోజుల్లో పండుగలు వస్తున్నందున అన్ని రాష్ట్రాలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో పాటు కరోనా పరీక్షల సంఖ్యనూ పెంచాలని చెప్పారు. టెస్టింగ్, ట్రీట్‌మెంట్, ట్రేసింగ్ ఫార్ములాను మరోసారి అనుసరించాలని స్పష్టం చేశారు. ప్రజలందరూ ప్రికాషన్ డోస్ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం సహా భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని వెల్లడించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రహోం మంత్రి అమిత్‌షా, ఆరోగ్యమంత్రి మన్‌సుక్ మాండవియా, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇందులో పాల్గొన్నారు. ఏ వేరియంట్ వ్యాప్తి చెందుతోందో వీలైనంత త్వరగా గుర్తించాలని సూచించారు మోడీ. కరోనా కథ అప్పుడే ముగిసిపోలేదని...అందరూ మాస్క్‌లు ధరించాలని చెప్పారు. విమానాశ్రయాల వద్ద నిఘా పెంచాలని సూచించారు. 


విదేశీ ప్రయాణికులకు సూచనలు..


కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నందున విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో వ్యాక్సినేషన్ నుంచి టెస్టింగ్ వరకు సూచనలు చేసింది. 


1. భారత్‌ వస్తున్న వాళ్లు లేదా రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ప్రయాణికులు తమ దేశంలో టీకా           ప్రక్రియలో భాగం కావాలని కోరారు.  


2. మీరు ప్రయాణిస్తుంటే, మీరు సామాజిక దూరం పాటిస్తూనే మాస్క్‌లను ఉపయోగించాలి. దీని కోసం అన్ని విమానయాన సంస్థలకు కూడా     ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయాణం, అన్ని ప్రవేశ పాయింట్ల వద్ద ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. 
3. ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే నిబంధనల ప్రకారం ఐసోలేషన్లో ఉంచుతామన్నారు. ఈ ప్రయాణీకుడు మాస్క్ ధరించాలి, మిగిలిన ప్రయాణీకుల నుంచి దూరంగా ఉండాలి.
4.డీ బోర్డింగ్ సమయంలో భౌతిక దూరం పాటించాలి. విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ప్రవేశ పాయింట్ల వద్ద హెల్త్ వర్కర్స్‌ను నియమించాలి.
5. స్క్రీనింగ్ సమయంలో ప్రయాణికుల్లో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని ఐసోలేట్ చేసి సమీపంలోని వైద్య కేంద్రానికి తీసుకెళ్లాలి. ఆరోగ్య ప్రోటోకాల్ అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవాలి.
6. విమానంలోని మొత్తం ప్రయాణీకుల సంఖ్యలో రెండు శాతం ర్యాండమ్‌గా పరీక్షించాలి. విమానాశ్రయంలో పరీక్షలకు పూర్తి ఏర్పాట్లుచేయాలి. సమస్య ఉన్న ప్రయాణీకుల గుర్తించి విమానయాన సంస్థలు సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. శాంపిల్ తీసుకున్న తరువాత, ప్రయాణీ కులను వెళ్ళడానికి అనుమతిస్తారు.


Also Read: Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ అంటే ఏంటి? కరోనాపై ఎలా పని చేస్తుంది?