Congress Presidential Polls: 


ఆ వివరాలు చెప్పండి: కాంగ్రెస్ నేతలు 


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సీనియర్లంతా...రాహుల్ గాంధీయే ఆ పదవికి సరైన వ్యక్తి అని చాలా గట్టిగానే తమ వాదన వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే...ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC)ఎలక్షన్ అథారిటీ చీఫ్‌ మధుసూదన్ మిస్త్రీకి 5 గురు కాంగ్రెస్ ఎంపీలు లేఖ రాశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పారదర్శకత పాటించాలని కోరారు. ఎలక్టోరల్ కాలేజ్‌లో కీలక పాత్ర పోషించే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC) ప్రతినిధుల జాబితాను అందరికీ అందించాలని విజ్ఞప్తి చేశారు. పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం...శశి థరూర్, మనీష్ తివారి, కార్తి చిదంబరం, ప్రద్యుత్ బోర్దొలాయ్, అబ్దుల్ ఖలేక్...సెప్టెంబర్‌ 6వ తేదీన ఈ లేఖ రాశారు. ఎవరు అభ్యర్థిని నామినేట్ చేయొచ్చు, ఎవరు ఓటు వేయడానికి అర్హులు..? అన్న వివరాలు స్పష్టంగా తెలియజేయాలని అడిగారు. "ఒకవేళ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (CEA) ఎలక్టోరల్ రోల్స్‌ని ప్రకటించేందుకు ఏమైనా ఇబ్బంది పడితే...కనీసం...ఆ వివరాలను అత్యంత భద్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. కీలకమైన వ్యక్తులకైనా వ్యక్తిగతంగా ఈ డిటెయిల్స్ చెబితే బాగుంటుంది" అని ఆ లేఖలో పేర్కొన్నారు 5గురు కాంగ్రెస్ నేతలు. 


రాహుల్ ఏమన్నారు..? 


ఎలక్టోరల్ రోల్స్‌ గురించి తెలుసుకునేందుకు ఎలక్టార్స్, క్యాండిడేట్లు అన్ని ప్రదేశ్ కమిటీలకు వెళ్లి ఆరా తీయాల్సిన పరిస్థితులు ఉండకూడదని చాల స్పష్టంగా చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఎంపీలుగా...పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరుకుంటు న్నట్టు తెలిపారు. అయితే...కాంగ్రెస్ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళతాయన్న విషయంలో ఇంకా స్పష్టత రావటం లేదు. అటు రాహుల్ గాంధీ..ప్రస్తుతానికి భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. కన్యాకుమారిలోని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో...ఇదే ప్రశ్న అడిగితే "పార్టీ అధ్యక్షుడిగా ఉండాలా లేదా అన్నది నేనెప్పుడో నిర్ణయించుకున్నాను" అని చెప్పారు. కానీ...ఆ కుర్చీలో కూర్చుంటారా లేదా అన్నది క్లియర్‌గా చెప్పలేదు. ఒకవేళ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే...అందుకు కారణాలేంటో మాత్రం తప్పకుండా చెబుతానని వెల్లడించారు రాహుల్. "నేను అధ్యక్షుడిని అయినా కాకపోయినా...ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామన్న క్లారిటీ అయితే మాకుంది" అని గట్టిగా చెప్పారు. 


సున్నితంగా తిరస్కరించిన అశోక్ గెహ్లోట్ 


అంతకు ముందు సోనియా గాంధీ..సీనియర్ నేత అశోక్ గెహ్లోట్‌ను కలిశారు. కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకోవాలని..అశోక్‌ను అడిగారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపటం లేదు. వయసు, ఆరోగ్యం రీత్యా ఈ పదవిని చేపట్టలేనని ఆయన ముందే క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడితే బాగుంటుందని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా...సోనియా గాంధీ..అశోక్ గెహ్లోట్‌ను పార్టీ బాధ్యతలు తీసుకోవాలని అడిగారు. అయితే...ఇందుకు గెహ్లోట్ ఆసక్తి చూపలేదు. "రాహుల్ గాంధీయే సరైన వ్యక్తి. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం" అని చెప్పారు. "నేనెప్పటి నుంచో ఒకటే విషయం చెబుతున్నాను. కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోసేది రాహుల్ గాంధీయే. ఆయన లేకపోతే, ప్రత్యక్షంగా వచ్చి పోరాడకపోతే ప్రజలు అసంతృప్తికి గురవుతారు. పార్టీ కూడా వీక్ అయిపోతుంది. మా అందరి అభిప్రాయాలను గౌరవించి, రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపడితే బాగుంటుంది" అని ఇటీవలే అశోక్ గెహ్లోట్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతే కాదు. ఆయనే అధ్యక్ష పదవి చేపట్టాలని రాహుల్‌ని బతిమాలతామనీ అన్నారు. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించక పోతే... ఇంకెవరినీ బలవంతంగా ఆ కుర్చీలో కూర్చోపెట్టకూడదు అని వ్యాఖ్యానించారు. 


Also Read: డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే స్టెట్స్‌పై బీజేపీ ఫోకస్- 15 రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల మార్పు