19-Party Opposition Meet: 'టార్గెట్ 2024.. రండి ఏకమవుదాం.. భాజపాను ఓడిద్దాం'

ABP Desam   |  20 Aug 2021 08:16 PM (IST)

2024లో భాజపా ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకంగా కావాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఈ రోజు 19 పార్టీలతో జరిగిన భేటీలో సోనియా కీలక వ్యాఖ్యలు చేశారు.

19 పార్టీల నేతలతో సోనియా గాంధీ భేటీ

ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఉన్నాయనే విషయాన్ని కేంద్రంలో ఉన్న భాజపాకు బలంగా వినిపించేలా నేడు 19 ప్రతిపక్ష పార్టీలు వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపు మేరకు ఈ సమావేశంలో 19 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలవాలని సోనియా గాంధీ కోరినట్లు సమాచారం.

అవరోధాలన్నింటినీ దాటి 2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపాపై పోరాడటానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధం కావాలని సోనియా గాంధీ సమావేశంలో పిలుపునిచ్చారు.

పార్లమెంటులో ప్రతిపక్షాల ఐకమత్యంపై విశ్వాసం ఉంది. అయితే పార్లమెంటు బయట అంతకంటే పెద్ద యుద్ధమే చేయాలి. పెగాసస్ విషయంలో చర్చ జరగకూడదని ప్రభుత్వం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను వృథా చేసింది.                   -  సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

సోనియా గాంధీ వ్యాఖ్యలను బంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతించారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమై భాజపాను ఓడించాలన్నారు దీదీ. ఇందుకోసం ఐకమత్యంగా ఉండాలని సూచించారు.

ఎవరెవరు హాజరయ్యారు..

ఈ సమావేశానికి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎల్జేడీ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొన్నారు.

Also read: ZyCoV-D Vaccine Emergency Approval: దేశంలో మరో టీకాకు అనుమతి.. 'జైకోవ్‌-డీ'కి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్

Published at: 20 Aug 2021 08:13 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.