Congress Eyes on Elections: 


నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..


ఈ మధ్యే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క గుజరాత్‌లో తప్ప మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కూడా పూర్తైంది. ఇక ఇప్పుడు అసలు సవాళ్లు ఎదుర్కోనుంది ఆ పార్టీ. అందులోనూ 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం చాలా ముఖ్యం. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే...తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. హిమాచల్, కర్ణాటక ఇచ్చిన జోష్‌తోనే ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. మే 24వ తేదీన కాంగ్రెస్ హైకమాండ్‌ కీలక భేటీకి పిలుపునిచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. పదవుల కోసం పోరాటాల వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ల్ అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. కర్ణాటకలోనూ ఇదే తప్పదని బీజేపీ నేతలు గట్టిగానే విమర్శించారు. కానీ...హైకమాండ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా పవర్ షేరింగ్ చేసింది. వాళ్లను బుజ్జగించింది. కర్ణాటకలో యుద్ధం ముగిసినా...రాజస్థాన్‌లో మాత్రం ఇంకా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. సచిన్ పైలట్, గహ్లోట్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. 


స్ట్రాటెజీ ఏంటి..? 


సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్. సీఎం కుర్చీ కోసం చాలా ఆరాట పడుతున్నారు. అటు గహ్లోట్ మాత్రం సీఎం కుర్చీ నుంచి దిగేదే లేదని తేల్చి చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరతకూ కారణమయ్యారు సచిన్ పైలట్. బీజేపీ నేతలతో కుమ్మక్కై కుట్ర చేశారని అశోక్ గహ్లోట్ చాలా సందర్భాల్లో విమర్శించారు. అప్పటి నుంచి పైలట్‌, గహ్లోట్‌కి మధ్య వైరం దూరం పెరుగుతూ వచ్చాయి. పవర్ షేరింగ్ ఫార్ములా కర్ణాటకలో వర్కౌట్ అయినా...రాజస్థాన్‌లో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే...అక్కడ కాంగ్రెస్‌కి జరిగిన అతి పెద్ద నష్టం..జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా..2020లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. రెబల్స్ అంతా బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే...ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై దాడి మొదలు పెట్టింది. తెలంగాణలోనూ కచ్చితంగా అధికారంలోకి వస్తామని కొందరు స్థానిక నేతలు చెబుతున్నా...అంత క్యాడర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే...భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కి బూస్టప్ వచ్చిందని హైకమాండ్  భావిస్తోంది. అందుకే...కర్ణాటక గెలుపుకి క్రెడిట్ అంతా రాహుల్‌కే ఇచ్చేశారు సీనియర్ నేతలు. ఇదో జోష్‌తో బరిలోకి దిగితే రానున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. 


Also Read: Kerala Story Controversy: థియేటర్‌ ఓనర్లను బెదిరిస్తున్నారు, కేరళ స్టోరీ వివాదంపై అమిత్ మాల్వియా