Chittoor News: తమిళనాడులోని కృష్ణగిరిలో రెండు వారాల క్రితం, కుప్పంలో గత వారంగా బీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఎట్టకేలకు బంధించి హోసూరు అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ రెండు ఏనుగులు తిరుపత్తూరు సమీపంలోని పొలాల్లో భీకరంగా పోరాడాయి. వాటి పోరాట దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. అయితే స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలతో కలసి మత్తు మందు ఇవ్వగా ఒకటి మత్తులోకి జారుకోగా.. మరొకటి తప్పించుకుంది. తప్పించుకున్న ఏనుగు జాడ పసిగట్టిన అధికారులు ఆ ఏనుగుకు కూడా మత్తు మందు ఇచ్చి బంధించారు. వారం రోజుల పాటు కుప్పం వాసులకు కంటి‌ మీద నిద్ర లేకుండా చేసిన రెండు ఏనుగులను బంధించడంతో కుప్పం వాసులు ఊపిరి పీల్చుకున్నారు.




ఇటీవలే మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి


పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.


అసలేం జరిగిందంటే?


ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వెళ్లిపోయిన రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది, పోలీసులు కొండ వైపునకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు.


ఏనుగుల బీభత్సం, పట్టించుకోని అధికారులు






 

మార్చి నెలలో చిత్తూరులో ఏనుగుల బీభత్సం..

 

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. బైరెడ్డిపల్లె మండలం, తార్లచేను  గ్రామం శివారులో దాదాపు 12 ఏనుగుల గుంపు పంట పొలాలను తొక్కి నాశనం చేశాయి. అంతేకాకుండా పొలం వద్ద ఉన్న లేగదూడను ఏనుగులు తొక్కి చంపాయి. రాగి, టమోట, వేరుశనగ వంటి పంటలను తొక్కి పూర్తిగా నాశనం చేశాయి. డ్రిప్ పైపులు, బోర్ మోటర్ పరికరాలను కూడా తొక్కడంతో అవన్నీ ధ్వంసం అయ్యాయి. అయితే విషయం గుర్తించిన రైతులు.. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పంటను మొత్తం నాశనం చేయడంతో తాము ఎలా బతకాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఏనుగుల బీభత్సం వల్ల సుమారు లక్ష రూపాయలకుపైగా పంట నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.