Cemetery Job: 


శ్మశానంలో జాబ్..


ఉదయం లేచింది మొదలు ఒకటే హడావుడి. పరుగులు పెట్టకపోతే ఏ పనీ అవ్వదు. ఆఫీస్‌ సంగతైతే చెప్పనక్కర్లేదు. ఒత్తిడి తట్టుకుంటూనే పని చేసుకోవాలి. కాదని కాస్త రిలాక్స్ అయితే...పై వాళ్లు అక్షింతలు వేస్తారు. వర్క్ లైఫ్‌ని, పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే చాలా మంది తడబడుతుంటారు. ఈ రెండింటినీ కలిపేసి ఇంకా ఒత్తిడికి గురవుతారు. ఈ స్ట్రెస్ నుంచి బయట పడేందుకు ఒక్కొక్కరూ ఒక్కో దారి వెతుక్కుంటారు. చైనాలో ఓ 22 ఏళ్ల యువతి మాత్రం చాలా వింత దారి వెతుక్కుంది. వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత కోసం శ్మశాన వాటికలో ఉద్యోగం సంపాదించుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం...చైనీస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన టాన్ అనే యువతి వెస్ట్ చైనాలోని చాంగ్‌కింగ్‌ మున్సిపాలిటీలోని శ్మశాన వాటికలో పని చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. "శ్మశానంలో ఉద్యోగమేంటి" అని కంగుతిన్నారు.


"ఇదే నా వర్క్ ప్లేస్. ఈ పని చాలా సులభంగా ప్రశాంతంగా ఉంది. ఆడుకునేందుకు కుక్కలు, పిల్లులు ఉన్నాయి. ఇంటర్నెట్ కూడా ఉంది" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ యువతి. "వర్క్ లైఫ్ నుంచి ముందుగానే రిటైర్ అయిపోయిన ఫీలింగ్ వస్తోంది" అని వివరిస్తోంది. ఆఫీస్‌లోని రాజకీయాలు, వ్యక్తిగత జీవితంలోని సమస్యలు...ఇలా అన్నింటినీ మరిచిపోయి హాయిగా ఈ ఉద్యోగం చేసుకుంటోంది టాన్. "ఈ పని చేసినందుకు నాకు నెలకు 4 వేల యువాన్‌లు వస్తాయి. వారానికి ఆరు రోజులు పని చేయాలి. అతిథులను ఆహ్వానించడం, సమాధులపై చెత్త చేరకుండా ఊడవడం లాంటివి చేస్తాను. మధ్యలో నాకు రెండు గంటల పాటు లంచ్ బ్రేక్ కూడా దొరుకుతుంది" అని చెబుతోంది. సాధారణంగా శ్మశానం అనగానే అదోలా చూస్తారు. అటు వైపు వెళ్లడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది...ఈ యువతి అక్కడే రోజంతా పని చేస్తుండటం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. "ఒకప్పుడు శ్మశానంలో పని చేయడం అనేది అరిష్టమే కావచ్చు. కానీ...ఈ రోజుల్లో ఆ పనే ప్రశాంతతనిస్తుంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 


తోడుగా ఉండే ఉద్యోగం..


అయినవారిని కోల్పోయి లేదా ఏదో ఒక కారణం వల్ల దూరమై కొందరు ఒంటరిగా జీవిస్తుంటారు. అలాంటివారికి ‘‘నేను తోడుగా ఉంటా’’ అంటూ ముందుకొస్తున్నాడు 38 ఏళ్ల వ్యక్తి. అయితే, అతడు ఊరికే తోడు రాడు. మీరు అతడు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తేనే తోడుంటాడు. పైగా మీరు అతడి ఎలాంటి పని చెప్పకూడదు. డబ్బులు తీసుకొని తోడుగా వచ్చే అతడి పేరు షోజీ మోరిమోటో. ఉండేది జపాన్ రాజధాని టోక్యోలో. లాంకీ బిల్డ్, యావరేజ్ లుక్‌తో ఉండే మోరిమోటో ఇప్పుడు ట్విట్టర్‌లో దాదాపు పావు మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. గతంలో తను ఓ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కానీ, తనకు ఆ ఉద్యోగం చేయడం నచ్చలేదు. కష్టంతో కూడిన పని చేయాలి అనిపించలేదు. అందుకే కష్టపడకుండా డబ్బులు సంపాదిండం ఎలా అని ఆలోచించడం మొదలు పెట్టాడు. చివరకు ఓ ఐడియా వచ్చింది. ఒంటరిగా ఉండే వారికి తోడుగా ఉండాలని భావించాడు. ఇదే విషయాన్ని తన మిత్రులకు చెప్పారు. నెమ్మదిగా అతడి గురించి జనాలకు తెలిసిపోయింది. ఒంటరిగా ఉండే వాళ్లు సరదాగా బయటకు వెళ్లేందుకు అతడిని తోడు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. వారితో గడిపేందుకు మోరిమోటో గంటకు 10,000 యెన్‌లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.5,600 వసూలు చేస్తున్నాడు.  


Also Read: BJP On AAP Govt: ఆప్ పాపాలు కడిగితే నర్మదా నది కూడా కలుషితమవుతుంది - కేంద్రమంత్రి ఫైర్