డ్రాగన్‌ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తోంది.  భారత భూభాగాల విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తోంది . చైనా తాజాగా తమ దేశ అధికార మ్యాప్‌ 2023 ఎడిషన్‌ను సోమవారం విడుదల చేసింది. అయితే ఇందులో భారత్‌ భూభాగాలను తమవిగా చూపిస్తోంది. సోమవారం చైనా అధికారికంగా విడుదల చేసిన మ్యాప్‌లో భారత్‌కు చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయిచిన్‌లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతాలను చైనా తమ భూభాగాలుగా పేర్కొంటోంది. అలాగే తైవాన్‌, వివాదాస్పద సౌత్‌ చైనా సముద్రాన్ని కూడా తమ స్టాండర్డ్‌ మ్యాప్‌లో చూపించింది. ఇంతకుముందు కూడా చైనా ఇలా పలుమార్లు భారత్‌ను రెచ్చగొట్టే విధంగా మ్యాప్‌లు విడుదల చేసింది. తాజాగా మరోసారి పొరుగుదేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాగా అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని, ముందు నుంచీ అలాగే ఉందని.. ఇక ముందు కూడా అలాగే ఉంటుందని భారత్‌ పలుమార్లు వెల్లడించింది.


చైనా సహజ వనరుల శాఖ ఈ మ్యాప్‌ను విడుదల చేసింది. 2023 ఎడిషన్‌ ఆఫ్‌ ద స్టాండర్డ్‌ మ్యాప్‌ ఆఫ్‌ చైనా పేరుతో మ్యాప్స్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. డిజిటల్‌ మ్యాప్స్‌, నావిగేషన్‌ మ్యాప్స్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.  చైనా జాతీయ సరిహద్దులు, ప్రపంచంలో ఇతర దేశాల సరిహద్దుల డ్రాయింగ్‌ ఆధారంగా ఈ మ్యాప్స్‌ను రూపొందించినట్లు  వెల్లడించింది. 


చైనా విడుదల చేసిన మ్యాప్‌ ప్రకారం.. అరుణాచల్‌ ప్రదేశ్‌ను సౌత్‌ టిబెట్‌గా, అక్సాయిచిన్‌ను 1962 యుద్ధంలో చైనా ఆక్రమించుకున్నట్లుగా చూపిస్తోంది. తాజా ఎడిషన్‌ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాలు తమవేనని చూపించింది . అలాగే వివాదాస్పద వివాదాస్పదమైన తొమ్మిది డ్యాష్‌ లైన్స్‌ కూడా చైనా మ్యాప్‌లో చూపించింది. దీని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో చాలా భాగాన్ని చైనా భూభాగంగా పేర్కొంటోంది. ఈ చర్య కారణంగా వియత్నాం, ఫిలిప్పీన్స్‌, మలేషియా, బ్రూనై, తైవాన్‌ వంటి దేశాల నుంచి కూడా డ్రాగన్‌ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఈ దేశాలు కూడా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను తమవంటే తమవి అని పోటీ పడుతున్నాయి.


డ్రాగన్‌ ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పదకొండు ప్రాంతాలకు చైనీస్‌, టిబెటిన్‌, పిన్‌యున్‌ భాషల్లో విడుదల చేయగా, వాటిని అక్కడి సివిల్‌ ఎఫైర్స్‌ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భూభాగాలను దక్షిణ టిబెట్‌లోని జాంగ్నాన్‌గా సూచించింది. అంతేకాకుండా ఇటానగర్‌ దగ్గరలో ఉన్న ఓ పట్టణాన్ని దానికి రాజధానికి చూపించింది. 


భారత్‌ ఈ విషయంపై ఎన్నో సార్లు స్పందించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగమని గట్టిగా నొక్కి చెప్తోంది. ఎల్లప్పుడూ అరుణాచల్‌ భారత్‌తోనే ఉందని, ఇక ముందు కూడా అలాగే ఉంటుందని వెల్లడించింది. భారత్‌లో త్వరలో జీ 20  సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చైనా ఇలాంటి వివాదాస్పద మ్యాప్స్‌ విడుదల చేయడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ సహా 42 మంది దేశాధినేతలను సదస్సుకు భారత్‌ ఆహ్వానించింది.