ప్రముఖ యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్లపై చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చైనా యాపిల్‌ అభివృద్ధిని దెబ్బ తీసేందుకు చర్యలు తీసుకుంటోందని, అందుకోసం చైనా ప్రభుత్వ అధికారులు పని కోసం ఐఫోన్లు వాడొద్దని ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తమ కథనంలో పేర్కొంది. చైనా సెంట్రల్‌ గవర్నమెంట్‌కు చెందిన సంస్థలలో ఐఫోన్లు లేదా విదేశీ బ్రాండెడ్‌ ఫోన్లను ఆఫీస్‌ వినియోగం కోసం వాడొద్దని, అలాగే వాటిని కార్యాలయాలకు తీసుకురావొద్దని అధికారులు వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అని పత్రిక తెలిపింది. 


పై స్థాయి అధికారులు కొన్ని వారాల క్రితమే ఈ ఆదేశాలు జారీ చేశారని అయితే వాటిపై ఎంత వరకు సీరియస్‌గా ఉన్నారు, ఎంత వరకు నిబంధనలు అమలవుతున్నాయి అనే అంశాలపై స్పష్టత లేదని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. అయితే నిషేధించిన విదేశీ బ్రాండ్స్‌లో కేవలం యాపిల్‌ పేరు మాత్రమే ఉందని, మరే పేరును అధికారులు ప్రస్తావించలేదని తెలిపింది. ఈ అంశంపై స్పందన కోరడానికి చైనా స్టేట్‌ కౌన్సిల్‌ ఇన్ఫర్మేషన్‌ కార్యాలయం అందుబాటులోకి రాలేదని, అలాగే యాపిల్‌ సంస్థ కూడా దీనిపై స్పందించలేదని వెల్లడించింది.


ఎంతో ఎదురుచూస్తున్న యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఎక్కువగా స్వదేశీ బ్రాండ్‌ ఫోన్లనే వాడాలని ప్రోత్సహించే దిశగా చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఐఫోన్‌ మార్కెట్‌పై పడుతుంది. అమెరికా తర్వాత యాపిల్‌కు అతి పెద్ద మార్కెట్‌ ఉంది చైనాలోనే. అయితే చైనీస్‌ టెక్‌ దిగ్గజం బెహమోత్‌ హవాయ్‌ సరికొత్త మోడల్‌ మేట్‌ 60 సిరీస్‌ చైనాలో యాపిల్‌ మార్కెట్‌ షేర్‌ను పంచుకునే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2019లో బాన్‌ చేసిన అమెరికన్‌ కంపెనీల నుంచి చైనా కంపెనీలకు సాఫ్ట్‌వేర్‌, ఎక్విప్‌మెంట్‌ అమ్మడాన్ని బ్యాన్‌ చేసిన తర్వాత హవాయ్‌ కంపెనీ చేస్తున్న లాంఛ్ కు ప్రత్యేకత సంతరించుకుందని నిపుణులు పేర్కొన్నారు. 


చైనాలో ఆర్థిక ప్రతికూల పవనాల ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ షిప్‌మెంట్స్‌ డిమాండ్‌ బలహీనపడింది. గత ఏడాదితో పోలిస్తే 2023 రెండవ త్రైమాసికంలో చైనాలో స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 4శాతం పడిపోయాయి. ఓప్పో, వివో కంపెనీలు 18 శాతం మార్కెట్‌ షేర్‌తో మొదటి రెండు స్థానాల్లో ఉండగా యాపిల్‌ కంపెనీ 16 శాతం షేరత్‌ మూడో స్థానంలో ఉంది. కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చి ప్రకారం.. చైనాలో రెండో త్రైమాసికంలో అత్యంత ఎక్కువ ఇయర్‌ ఓవర్‌ ఇయర్‌ గ్రోత్‌ సాధించిన కంపెనీ యాపిల్‌ అని పేర్కొంది. పండగల సీజన్‌లో ఐఫోన్‌ 14 ధర తగ్గించడం వల్ల అధికంగా అమ్ముడుపోయినట్లు తెలిపింది.