Chandrayan 3 Landing Live: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మక చంద్రయాన్ - 3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం రోజు సాయంత్రం జరిగే సేఫ్ ల్యాండింగ్ కోసం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ కూడా కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రభుత్వ బడులతో పాటు కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని విద్యార్థులు లైవ్ లో చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీఈఓలు, ప్రన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆగస్టు వ తేదీన సాయంత్రం 5.30 గంటల సమయంలో చంద్రయాన్  3 సేఫ్ ల్యాండింగ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీన్ని తెలంగాణ విద్యా ఛానెల్స్ అయిన టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. 






ఈ ఛానెళ్లను ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తెరలు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి టెలికాస్ట్ చేయనున్నారు. పాఠశాల ముగిసిన విద్యార్థులు ఒకచోట చేరి ఈ లైవ్ వీడియోను వీక్షించేలా విజ్ఞప్తి చేయనున్నారు. దేశంలోని విద్యార్థులు, యువత అంతా చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని ఇస్రో కోరింది. భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన ఇది యువతకు స్ఫూర్తిని ఇచ్చేలా విజయవంతం అవుతుందని.. అందరూ అందుకోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. ఈక్రమంలోనే తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చంద్రయాన్ - 3 కీలక దశకు చేరుకోగా ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడికి మరింత చేరువైంది. ల్యాండర్ తీసిన చంద్రుడి ఫొటోలను కూడా ఇస్రో ఇప్పటికే విడుదల చేసింది. జయహో భారరత్, జయహో ఇస్రో అంటూ యావత్ భారతావని చంద్రయాన్ - 3 సేఫ్ ల్యాండ్ అవ్వాలని కోరుకుంటోంది. 


Also Read: Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగంలో ఆ 20 నిమిషాలే అత్యంత క్లిష్టం, అనుకున్నట్లు జరిగితే విజయమే


ఆ 20 నిమిషాలే కీలకమట..!


చంద్రుని ఉపరితలానికి 25 కిలోమీటర్ల ఎత్తు నుంచి విక్రమ్ ల్యాండర్ తన ల్యాండింగ్ కోసం ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలం వైపు దూసుకుపోతుంది. అంటే గంటకు సుమారు 6048 కిలోమీటర్ల వేగంతో విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలం వైపు ప్రయాణిస్తుంది. ఈ వేగాన్ని క్రమంగా తగ్గించేందుకు విక్రమ్ ల్యాండర్ కు ఉన్న ఇంజిన్ పని చేయడం ప్రారంభిస్తాయి. 


ఈ సమయంలో ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి దాదాపుగా అడ్డంగా ఉంటుంది. దీనిని రఫ్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఇది దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగుతుంది. కొన్ని విన్యాసాల తర్వాత విక్రమ్ ల్యాండర్ నిలువుగా ఉంటుంది. దీనిని ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ కావడానికి ఇది చక్కటి దశ. అయితే ఈ దశలోనే చంద్రయాన్-2 అదుపు తప్పి కూలిపోయింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలానికి 800 మీటర్ల ఎత్తుకు రాగానే.. ల్యాండింగ్ చేయడానికి మంచి స్థలం కోసం సర్వే చేయడం మొదలవుతుంది. ఈ సమయంలోనే ల్యాండర్ క్షితిజ సమాంతర, నిలువు వేగాలు రెండూ సున్నాకి వస్తాయి. విక్రమ్ ల్యాండర్ 150 మీటర్ల వద్ద మరోసారి హోవర్ చేయడం కోసం ఆగుతుంది. ప్రమాదాలను గుర్తించడానికి, ఉత్తమ ల్యాండింగ్ చోటు గురించి చిత్రాలు తీస్తుంది. ఈ సమయంలో ల్యాండర్ కు ఉన్న నాలుగింటిలో కేవలం 2 ఇంజిన్లు మాత్రమే పని చేస్తాయి. చంద్రుని ఉపరితలాన్ని సెకనుకు 3 మీటర్ల వేగంతో అంటే గంటకు 10.8 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. 


ల్యాండింగ్ సమయంలో చెలరేగే చంద్ర ధూళి పూర్తిగా తొలగిన పోయిన తర్వాత ర్యాంప్ మెల్లిగా తెరుచుకుంటుంది. ఆ ర్యాంప్ పై నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కిందకు దిగుతుంది. సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో రోవర్ కదులుతూ చంద్రుని పరిసరాలను స్కాన్ చేస్తూ ఆ డేటాను ల్యాండర్ కు పంపిస్తుంది. పేలోడ్స్ కాన్ఫిగర్ చేసిన టూల్స్ ఆ డేటాను గ్రహిస్తాయి. మూడు పేలోడ్స్ విక్రమ్ ల్యాండర్ ఉపరితల ప్లాస్మా (అయాన్లు, ఎలక్ట్రాన్ లు) సాంద్రతను కొలుస్తుంది. చంద్రుడి ఉపరితలం ఉష్ణ లక్షణాల కొలతలను నిర్వహిస్తుంది. ల్యాండింగ్ సైట్ చుట్టూ భూ స్వభావాన్ని అంచనా వేస్తుంది. లూనార్ క్రస్ట్, మాంటిల్ నిర్మాణాలను పరిశీలిస్తుంది. సౌరశక్తితో నడిచే ల్యాండర్, రోవర్ చంద్రుని పరిసరాలను అధ్యయనం చేయడానికి సుమారు 2 వారాల సమయం పడుతుంది. రోవర్ కేవలం ల్యాండర్ తో మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. ల్యాండర్ భూమిపై ఉన్న శాస్త్రవేత్తలతో కనెక్షన్ కలిగి ఉంటుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ ను కంటింజెన్సీ కమ్యూనికేషన్ రిలేగా కూడా ఉపయోగించవచ్చని ఇస్రో తెలిపింది.