చంద్రబాబు చేసిన స్కాంలు ఒక్కొక్కటిగా బయటపడతాయని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో బైరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నదని వ్యాఖ్యానించారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అని తెలిపారు.  తనకు ఉన్న పరిచయాలు పెద్దవి అనే అహంకారంతో చంద్రబాబు ఉన్నారని తెలియజేశారు. తన స్నేహితులు అన్ని రంగాల్లో ఉన్నారని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే అన్ని స్కాం లు  చేశారు. చంద్రబాబు ఎవరికి మంచి చేయలేదు కాబట్టి ఆయనకు ఎవరు అండగా నిలబడలేరని తెలిపారు.


సిఐడి అధికారులు చంద్రబాబు అరెస్ట్ చేయడం మంచి  పని కాదు వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. పుష్కరాలు, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోను భారీ అవినీతి చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు తదితర వాటిల్లో కూడా పెద్ద అవినీతి చేశారని తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్స్, మంత్రులు జైలుకు పోతారు నాకేంటిలే అని చంద్రబాబు అవినీతి చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్లు వేయకుండానే డబ్బులు తినేశారని ధ్వజమెత్తారు. ఎవరైనా పుష్కరాలు పుణ్యం కోసం చేస్తారు... కానీ చంద్రబాబు మాత్రం డబ్బుల కోసం చేశారని మండిపడ్డారు.


ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. మనవాళ్లు బ్రిఫ్డ్ మీ అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. ఇలా అనేక స్కాం లు చేసిన చంద్రబాబును ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన తప్పును ఒప్పుకొని పొరపాటు అయిందని చెప్పి చెంపలు వేసుకోవాల్సింది పోయి అమాయక జనాలను రెచ్చగొట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో కట్టిన టిట్కో ఇలా దగ్గర్నుంచి సెక్రటేరియట్ వరకు అన్నింటిలోనూ దోపిడీ చేశారని తెలిపారు.  


అవినీతి చేసిన వారు ఎంత పెద్ద వారైనా శిక్షకు అర్హుడేనని బైరెడ్డి వ్యాఖ్యానించారు. తప్పు చేసినవారికి కొందరు వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు అంశాన్ని కొన్ని మీడియా వర్గాలు రాజకీయ కుట్రగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు, యువకులు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని కోరారు. దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నేరుగా ప్రభుత్వ ధనాన్ని తన సొంత ఖాతాలోకి వేసుకోవడం ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని నేరుగా ప్రభుత్వ సొమ్మును కాజేయడమనే అతిపెద్ద స్కాం ఎక్కడ ఉండదన్నారు. జనాల్లో మాత్రం నేనెక్కడ అవినీతి చేయలేదని ప్రసంగాలు చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందని దుయ్యబట్టారు. 


ఇక చంద్రబాబు మేనేజ్మెంట్ టైం అయిపోయిందని, నిజాలు దాస్తే  దాగేవి కావని అన్నింటికీ కాలం సమాధానం ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఏ తప్పు చేయకుండానే జగన్ పై అప్పటి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కాలమే ఇందుకు సమాధానం చెబుతుందని వెల్లడించారు. చంద్రబాబు తప్పు చేశారని స్వయంగా ఆయన లయారే కన్విన్స్ అయ్యారని, అందుకే అరెస్టు చేసిన విధానం బాగాలేదని అన్నాడు తప్ప తప్పు చేయలేదు అని అనలేదని వెల్లడించారు. చట్టం తన పని తాను చేసుకోపోతుందని వ్యాఖ్యానించారు.