Gannavaram Incident: రాజకీయ అవసరాల కోసం పోలీసు వ్యవస్థను, అధికారులను జగన్ మోహన్ రెడ్డి వాడుకుంటున్నారని ఆరోపించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. అందుకే ఏపీలో ప్రభుత్వ అరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నవరంలో జరిగిన ఘటనపై బహిరంగ లేఖ రాసిన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారాయని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే... ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గన్నవరం విధ్వంసం ఒక తాజా ఉదాహరణఅని చెప్పుకొచ్చారు. గన్నవరం ఘటనలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై, పార్టీ నేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేయడం దారుణం అన్నారు. ఆ బాధితులనే నిందితులుగా మార్చి జైలుకు పంపిన వైనంపై వాస్తవాలును ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. 


అరాచక పాలనతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్న ఆస్తులను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు... బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారిందన్నారు. పన్నులపై ప్రజలు ప్రశ్నిస్తే కేసులు, జాబ్ క్యాలెండర్ గురించి గళమెత్తితే నిరుద్యోగ యువతకు వేధింపులు, ధాన్యం బకాయిలు అడిగితే రైతులకు బేడీలు, జీతాలు అడిగితే ఉద్యోగులకు బెదిరింపులు అన్నట్లు పరిస్థితి మారిందని తెలిపారు. కొవిడ్ సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్... మద్యం పై ప్రశ్నించిన ఓం ప్రతాప్ ప్రాణాలు తీశారని గుర్తు చేశారు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన వరప్రసాద్ కు పోలీస్ స్టేషన్ లోనే శిరోముండనం చేశారని...  వైపీసీ పాలనులో ఇలాంటి ఘటనలు కోకొల్లలు అని తెలిపారు. 


ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై ప్రజలను చైతన్య వంతులను చేయడానికి తాను చేపట్టిన పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందిన చంద్రబాబు వివరించారు. ఇటీవల జగ్గంపేట, పెద్దాపురంలో తమ పర్యటనల అనంతరం... ప్రజాస్పందన చూసి భయపడిన ఈ ప్రభుత్వం, అనపర్తి సభకు అడ్డంకులు సృష్టించిందన్నారు. సభకు ముందగా అనుమతులు ఇచ్చిన పోలీసులు ప్రభుత్వ ఒతిడితో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. అయితే నాడు సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీజీ చేసిన దండి మార్చ్ స్పూర్తితో... తాను 7 కిలో మీటర్లు నడిచి అనపర్తి మార్చ్ నిర్వహించానన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ... ప్రభుత్వ తీరును ఎండగడుతూ సాగిన అనపర్తి సభ విజయవంతం అయిందిన ఆయన తెలిపారు. దీంతో సిఎం ఒత్తిడితో ఎన్నడూ లేని విధంగా ఏకంగా వెయ్యి మందిపై అనపర్తిలో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఆంక్షలు, నిర్భందాలు ఉన్నా అద్భుతంగా జరిగిన సభతో ఉలిక్కిపడిన జగన్... గన్నవరంలో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. హింసాత్మక ఘటనలతో ప్రజల, ప్రతిపక్షాల గొంతు నొక్కక పోతే ఇక లాభం లేదని భావించి.... గన్నవరం విధ్వంసానికి పాల్పడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రజల తరుపున గళం వినిపిస్తున్న బడుగు బలహీన వర్గాలను అణిచివేయాలనే కుట్రలో భాగంగానే.. గన్నవరం హింసకు పాల్పడ్డారని ఫైర్ అయ్యారు. ఈ నెల 20వ తారీఖున గన్నవరంలో కొంతమంది కళంకిత పోలీసు అధికారుల సహకారంతో వైసీపీ గూండాలు ప్రణాళికా బద్దంగా తెలుగుదేశం నేతలపై దాడులు, పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారన్నారు. స్థానిక శాసన సభ్యుడి అరాచకాలను, సంకల్ప సిద్ది స్కాంలో అక్రమాలను గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా గట్టిగా ప్రశ్నించారని.. అది జీర్ణించుకోలేక ఆ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దొంతు చిన్నాకు ఫోన్ చేసి తమ నేతనే విమర్శిస్తావా అంటూ బెదిరించారని తెలిపారు. 20వ తేదీ ఉదయం 11.30 గంటలకు వైసీపీ గూండాలు దొంతు చిన్నా ఇంటిపై దాడికి పాల్పడ్డారన్నారు. చిన్నా ఇంట్లో లేకపోవడంతో ఆయన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో బాధితులు పోలీసు సాయం అర్ధించినా వారు స్పందించలేదన్నారు. దీంతో అదే రోజు సాయంత్రం నియోజకవర్గ నేతల సహకారంతో ఘటనపై ఫిర్యాదు చేసేందుకు చిన్నా సతీమణి రాణి పోలీస్ స్టేషన్ కు వెళ్లారని వివరించారు. టీడీపీ నేతలంతా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సమయంలో... వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన వైసీపీ రౌడీ మూకలు తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారని తెలిపారు. కార్లు, ఇతర వాహనాలు తగలబెట్టారని, కార్యకర్తలు, నేతలపై దాడులు చేశారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో పార్టీ  కార్యకర్తలు ఆత్మరక్షణ, ఆస్తులు రక్షణకు అక్కడికి వచ్చిన పాపానికి టీడీపీ వారిపైనే పోలీసులు జులుం ప్రదర్శించారన్నారు. ఘటనపై నిరసనలు తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలపై రెండోసారి కూడా వైసీపీ గూండాలు పోలీసుల ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారని చంద్రబాబు లేఖలో వెల్లడించారు. మళ్లీ రాత్రి 8 గంటలకు దొంతు చిన్నా ఇంటికి వెళ్లి అతని వాహనాన్ని దహనం చేశారని,  ఒక్క రోజు వ్యవధిలో బీసీ నాయకుని ఇంటిపై ఈ స్థాయిలో దాడి జరగడం చూస్తుంటే.. బలహీన వర్గాలకు రక్షణ లేదన్న విషయం స్పష్టం చేస్తోందన్నారు.


ఇలా రోజంతా యథేఛ్చగా విధ్వంసం జరుగుతున్నా... ఘటనపై ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చంద్రబాబు వెల్లడించారు. తమ నేతలు జిల్లా ఎస్పికీ ఫోన్ చేసినా స్పందించలేదని, కనీసం అదనపు బలగాలు తెచ్చి పరిస్థితిని చక్కదిద్దలేదని ఫైర్ అయ్యారు. ఈ దాడుల ఘటనలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో, అక్కడ ఉన్న వారి ఫోన్ లలో రికార్డు అయ్యాయని పేర్కొన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే యావత్ సమాజం విస్తుపోయేలా బాధితులైన టీడీపీ కార్యకర్తల పైనే హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో వైసీపీ శ్రేణులు, వారికి నాయకత్వం వహిస్తున్న గూండాలు స్వైరవిహారం చేసినా పోలీసులు వారిని కనీసం నిలువరించలేదని అన్నారు. పోలీసు వ్యవస్థను, పోలీసు అధికారులను తమ రాజకీయ అవసరాలకు వాడుకుని.. సీఎం జగన్ వారిని బలిపశువులు చేస్తున్నారన్నారు. ఈ కుట్రలో పోలీసులు భాగస్వాములు కావొద్దని విజ్ఫప్తి చేస్తున్నానన్నారు.


ఈ ఘటనలో 40 మందికిపైగా టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వారిలో కొందరిని పోలీసు కస్టడీలో దారుణంగా హింసించారని చంద్రబాబు వివరించారు. మహిళలు అని కూడా చూడకుండా అక్రమంగా అదుపులోకి తీసుకుని రాత్రంతా పోలీస్ స్టేషన్లకు తిప్పారన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న టీడీపీ నేతలను జైలుకు పంపాలి అనే ఏకైక ఉద్దేశ్యంతో.... టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు పెట్టి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన చూస్తేనే పోలీసు వ్యవస్థ ద్వారా ఏ స్థాయిలో తప్పుడు కేసులు పెడుతున్నారో అర్థం అవుతుందన్నారు. గన్నవరం దాడులకు స్థానిక ఎమ్మెల్యే వ్యూహ రచన చేయగా... ఆయన వ్యక్తిగత సహాయకుడు, సంకల్ప సిద్ది స్కాంలో ప్రధాన నిందితుడు ఓరుపల్లి రంగా దాడుల్లో ముందున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజల నుంచి రూ. 1100 కోట్లు అక్రమంగా వసూలు చేసి వారిని మోసం చేసిన సంకల్ప సిద్ది స్కాంలో ఇతను నిందతుడని చెప్పారు. ఈ మొత్తం ఘటనలో దాడులకు గురైంది తెలుగుదేశం కార్యకర్తలు, ధ్వంసం అయింది తెలుగుదేశం పార్టీ కార్యాలయం అని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలే బాధితులు కాగా.. పోలీసులు అక్రమ కేసులు పెట్టి నిందితులను చేశారన్నారు. 


నియంతృత్వ ధోరణులకు నిలువెత్తు నిదర్శనమైన సీఎం జగన్ డా. బి.ఆర్. అంబేద్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తన సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తుందన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ గాని, కార్యకర్తలు గాని, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలు గాని వీటికి భయపడే పరిస్థితి ఉండదని వివరించారు. 40 ఏళ్లుగా పార్టీని ఆదరించిన ప్రజలను కాపాడుకోవడం కోసం, బాధ్యత కలిగిన నేతగా ప్రజలను చైతన్య పరుస్తానన్నారు. రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఏ స్ధాయి పోరాటానికి అయినా తాను సిద్దంగా ఉన్నానని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధర్మానికి - అధర్మానికి, ప్రజాస్వామ్యానికి - నియంత పోకడలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ప్రశ్నించే ప్రజలు, ప్రజా సంఘాలు, వారి పక్షాన పోరాడే ప్రతిపక్షాలు అణిచివేతకు గురైతే అంతిమంగా నష్టపోయేది సామాన్య ప్రజానీకమేనని తేల్చి చెప్పారు. ఈ పోరాటంలో అందరం కలిసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సమిష్టి తిరుగుబాటుతో ప్రభుత్వ ఉగ్రవాదాన్ని ఎదుర్కొందామని.. మన భవిష్యత్తుతో పాటు పిల్లల భవిష్యత్తును కాపాడుకుందామని సూచించారు.