High-Risk Alert for Samsung Mobiles: 



శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌లకు అలెర్ట్..


శామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఫోన్‌ యూజర్స్‌కి అలెర్ట్ వార్నింగ్స్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. Indian Computer Emergency Response Team కి చెందిన సెక్యూరిటీ అడ్వైజరీ ఈ అలెర్ట్‌ ఇచ్చింది. లక్షలాది శామ్‌సంగ్ గ్యాలక్సీ ఫోన్‌ల సెక్యూరిటీకి భంగం వాటిల్లే ప్రమాదముందని అప్రమత్తం చేసింది. కొత్త మోడల్స్‌తో పాటు పాత మోడల్స్‌కి కూడా ఈ వార్నింగ్ ఇచ్చింది. డిసెంబర్ 13నే ఈ  అలెర్ట్ జారీ చేసింది కేంద్రం. ఈ సెక్యూరిటీ అలెర్ట్‌ని హైరిస్క్‌గా కేటగిరీ చేసింది. యూజర్స్ అందరూ వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. శామ్‌సంగ్‌ మొబైల్స్‌లో vulnerabilities ఎక్కువగా ఉన్నాయని, వాటిని అలాగే వదిలేస్తే సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని ఎవరైనా చాలా సులువుగా సైబర్ దాడికి పాల్పడే ప్రమాదముందని వివరించింది. సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా మొబైల్స్‌లో స్పెషల్ కోడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేసి పూర్తిగా అధీనంలోకి తీసుకునే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం...శామ్‌సంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ 11,12,13,14 వర్షన్స్‌ మొబైల్స్‌కి ఈ సమస్య ఉందని వెల్లడించింది. ఒకవేళ సైబర్ దాడి జరిగితే..అటాకర్స్ ఫోన్ సీక్రెట్‌ కోడ్‌ని సులువుగా యాక్సెస్ చేయొచ్చు. ప్రైవేట్ ఫైల్స్‌నీ యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. ముఖ్యమైన సమాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీ మొబైల్ మీ చేతిలో ఓ బొమ్మగా మారిపోతుంది. ఎక్కడి నుంచే అటాకర్స్ కంట్రోల్ చేస్తుంటారు. పూర్తిగా వాళ్ల అధీనంలోకి వెళ్లిపోతుంది. అందుకే...వీలైనంత త్వరగా సాఫ్ట్‌వేర్‌ని అప్‌డేట్ చేసుకోవాలని తేల్చిచెబుతోంది ప్రభుత్వం.