Mumbai Rains: ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ వర్షాలకు ముంబయిలోని గ్రాంట్‌ రోడ్‌లో ఓ భవనం కూలిపోయింది. రోజంతా వర్షం కురవడం వల్ల నాలుగంతస్తుల ఒక్కసారిగా బిల్డింగ్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 13 మందికి గాయాలయ్యాయి. రెండు, మూడో అంతస్తులకు పగుళ్లు రావడం వల్ల భవనం కూలిపోయినట్టు స్థానికులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బిల్డింగ్‌లో దాదాపు 40 మంది ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌ బాధితులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ఉదయం 10.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి కాలు శిథిలాల కింద చిక్కుకుని నరకయాతన అనుభవించాడు. స్థానికులు ఆ వ్యక్తిని గుర్తించి ఆ శిథిలాల్ని తొలగించి కాపాడారు. బిల్డింగ్ ముందు భాగమంతా పగుళ్లు వచ్చింది. ప్రమాదకరంగా వేలాడుతోంది. అది ఏ క్షణంలోనైనా కూలే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 






మూడు రోజులుగా వర్షాలు..


దాదాపు మూడు రోజులుగా ముంబయిలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ స్తంభించిపోయింది. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. సముద్రంలో అలలు ప్రమాదకర స్థాయిలో ఎగిసి పడుతున్నాయి. ఇలాగే వర్షాలు కొనసాగితే వరదలు మరింత భారీగా ముంచెత్తే ప్రమాదముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ముంబయిలో ఇప్పటికే ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జులై 19వ తేదీన సెంట్రల్ ముంబయిలో 78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైల్వే ట్రాక్‌లపై భారీ ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. ట్రైన్ సర్వీస్‌లు ఆగిపోయాయి. పలు చోట్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సబ్‌వేలు నీటితో నిండిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 






నాగ్‌పూర్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్కూల్స్‌కి సెలవులు ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం లేదని అధికారులు వెల్లడించారు. భివండి సిటీలో మాత్రం ఎఫెక్ట్‌ గట్టిగానే ఉంది. చాలా చోట్ల మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు. వరదలు ముంచెత్తే అవకాశమున్నందున జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


Also Read: Work From Home: ఆఫీస్‌కి రాకపోతే లీవ్స్ అన్నీ కట్‌, కొత్త రూల్‌తో ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కంపెనీ