British MP on BBC:


తప్పు చేస్తే చర్యలు..


ఢిల్లీ, ముంబయిల్లోని BBC కార్యాలయాల్లో జరుగుతున్న సోదాలపై యూకే ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ స్పందించారు. ABP Liveలో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. BBCలో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే...భారత్‌లోని సంస్థలకు సోదాలు నిర్వహించే హక్కు ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో యూకే ప్రభుత్వం జోక్యం చేసుకోదని వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో BBC డాక్యుమెంటరీ గురించి కూడా ప్రస్తావించారు. ఈ డాక్యుమెంటరీని వెలుగులోకి తెచ్చినందుకే IT సోదాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై స్పందించారు. ఆ అంశానికి, ఇప్పటి సోదాలకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. 


"నాకు తెలిసి వీటికి ఎలాంటి సంబంధమూ లేదు. నిజంగానే ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే భారత్‌లోని సంస్థలకు విచారించే హక్కు తప్పకుండా ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అని సర్వే చేస్తున్నారు. ఒకవేళ ఇవి సరిగా లేకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటారు. బీబీసీ డాక్యుమెంటరీకి, సోదాలకు సంబంధం ఉందనడానికి ప్రస్తుతం ఆధారాలు ఏమీ లేవు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నాను" 


-బాబ్ బ్లాక్‌మన్, యూకే ఎంపీ


బీబీసీ అనేది  ఓ ప్రైవేట్ సంస్థ అని, దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు బాబ్. బీబీసీపై వచ్చిన ఆరోపణలపై కచ్చితంగా విచారణ జరిపించాలని అన్నారు. 


ఢిల్లీ,ముంబయిల్లోని BBC కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇవి దాడులు కావని కేవలం "సర్వే" అని ఐటీ చెబుతున్నా...విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై News Broadcasters and Digital Association (NBDA)
కూడా స్పందించింది. అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 


"ఏ సంస్థ అయినా సరే చట్టానికి లోబడే ఉండాలి. మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నించడం ముమ్మాటికి తప్పే. జర్నలిస్ట్‌లు, మీడియా సంస్థల స్వేచ్ఛను హరించడం సరి కాదు. ఇలాంటి చర్యలు రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కుని దెబ్బ తీస్తాయి. ఇవి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం." 









ఇలాంటి "సర్వేలు" చేపట్టడం అంటే మీడియాను వేధించడమే అని తేల్చి చెప్పింది NBDA. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాసామ్య దేశమైన భారత్‌ ప్రతిష్ఠకూ మచ్చతెచ్చి పెడుతుందని అసహనం వ్యక్తం చేసింది. 


"కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సర్వేలు చేపట్టినా అవి న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉండాలి. వాటిని అతిక్రమించకూడదు. ఈ విషయంలో కచ్చితత్వం అత్యవసరం" 


- ఎన్‌బీడీఏ 


India: The Modi Question’ పేరిట బీబీసీ చేసిన డాక్యుమెంటరీ కొంత కాలంగా వివాదాస్పదమవుతోంది. గుజరాత్ అల్లర్లతో పాటు ప్రధాని మోదీకి సంబంధించిన ఈ డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టిస్తోందంటూ కేంద్రం బ్యాన్ విధించింది. సోషల్ మీడియాలోనూ ఎక్కడా ఈ వీడియో క్లిప్‌లు కనిపించకుండా సెన్సార్ విధించింది. ఈ క్రమంలోనే హిందూ సేన అసలు బీబీసీ ఛానల్‌నే సెన్సార్ చేయాలంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు చివరకు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. 


Also Read: UK Sales Director: బట్టతల ఉందని ఉద్యోగంలో నుంచి తీసేసిన కంపెనీ, రివెంజ్ తీర్చుకున్న ఎంప్లాయ్