తమ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. భవిష్యత్ తెలుసుకోవడానికి కొంత మంది జాతకాలు నమ్ముతారు. ఇంకొంత మంది బాబాలు, భూత వైద్యులు చెప్పే మాటలను విశ్వసిస్తుంటారు. ఈ జాతకాలు అంతా ట్రాష్.. మేం అస్సలు నమ్మం అని కొందరు వాదిస్తుంటే మరికొందరు మాత్రం వీటిని విపరీతంగా నమ్ముతుంటారు. శుభకార్యాల వరకు అంటే పర్లేదు.. కానీ ప్రతి చిన్న పనికి ఆఖరికి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా కూడా ముహూర్తం చూసుకునే వారు ఉంటారంటే అతిశయోక్తి కాదేమో. 


ఈ జాతకాల నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు మాయగాళ్లు బాబాల పేరుతో మోసాలకు తెగబడే ఘటనలు కూడా మనం చూస్తుంటాం. ఇది ఏ నగరాలకో, పట్టణాలకో పరిమితం కాలేదు. మారుమూలన ఉన్న గ్రామాలలో కూడా ఉంటుంది. అక్కడైతే ఏకంగా దెయ్యాలు, భూతాలు వంటివి ఉన్నాయని చెప్పి.. చేతబడులు, భూత వైద్యాలు పేరిట అమాయకులు జేబులు కొల్లగొట్టే బాబాలు కూడా ఉంటారు. 


ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో జాతకాలు చెబుతూ.. తమ పడ్డం గడుపుతుంటారు. కొంతమంది బాబాలు ప్రజలందరి మధ్యలో నీతి వాఖ్యాలు వల్లిస్తూ.. నాలుగు గోడల మధ్య కానుకల రూపంలో నగదు, డబ్బు వంటివి వెనకేస్తుంటారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక బాబా మాత్రం ఎవరూ ఊహించని రీతిలో వినూత్న బహుమతి తీసుకురావాలని తన భక్తులను కోరుతున్నాడు. అది తెచ్చిన వారికి మాత్రమే జోష్యం చెబుతానని అంటున్నాడు. అయితే ఈ బాబా తెలుగు వ్యక్తే. తమిళనాడుకు వెళ్లి సెటిల్ అయ్యాడు.


పెగ్గేస్తేనే చెబుతా..
తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూర్‌లోని టోల్ ప్లాజా సమీపంలో ఉండే నెమలి గ్రామంలో ఏపీకి చెందిన మణి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. గత పదేళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో పలువురు వద్ద సేకరించిన‌ నగదుతో ఓ ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నాడు. ఈ ఆలయంలో భవిష్య వాణి పేరుతో మణి జాతకాలు చెప్పడం ప్రారంభించాడు. దీనికి గానూ టికెట్ ధర కింద మంగళవారం నాడు రూ.500, బుధవారం నాడు రూ.1000కిపైగా వసూలు చేసేవాడు. అయితే కొన్నేళ్లుగా ఈ ఆలయానికి కూతవేటు దూరంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించి ఏకంగా మణి బాబా అవతారం ఎత్తాడు. 


సాధారణంగా బాబాలకు భక్తులు పండ్లు, పూలు, ఆహార పదార్థాలు, నగదు వంటివి సమర్పిస్తారు. కానీ ఈ మణి బాబా మాత్రం ప్రత్యేకంగా భక్తుల వద్ద నుంచి ఫుల్ బాటిల్ మద్యం తీసుకుంటాడు. తన వద్దకు రావాలంటే టికెటు ధర కాకుండా మద్యంను స్వీకరిస్తాడు. నిషా ఎక్కితే తప్ప భక్తుల భవిష్యత్తు వాణి చెప్పనని మణి అంటాడు. భక్తులు సమర్పించిన ఆ ఫుల్ బాటిల్ ఒక్కసారిగా తాగేసి తన వద్దకు వచ్చిన వారికి భవిష్య వాణి చెబుతాడు. 


మహిళలకు నో ఎంట్రీ.. 
ఈ బాబా కొన్ని కండీషన్లు కూడా పెట్టాడండోయ్. ఇక్కడకు మహిళలకు నో ఎంట్రీ అని బోర్డు పెట్టాడు. కేవలం పురుషులు మాత్రమే రావాలని చెబుతున్నాడు. ఈ బాబా దగ్గర భవిష్య వాణి వినేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు క్యూ కడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ బాబా ఫుల్ జోష్ తో జాతకం చెబుతోన్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి. 



Also Read: Bigg Boss Telugu Season 5 Live: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 లైవ్ అప్‌డేట్స్.. 13వ కంటెస్టెంట్‌గా ‘7 ఆర్ట్స్’ సరయు బోల్డ్ ఎంట్రీ