TDP Party Launching: జనవరి 9వ తేదీ తమకు చాలా ప్రాముఖ్యమైన రోజు అని విశాఖ టీడీపీ ఆఫీస్ లో రాష్ట్ర పార్టీ పాలిట్  బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. తెలుగు వారికి జరుగుతున్న అవమానాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టారని గుర్తు చేశారు. ఎక్కువ యువతకు అవకాశం ఇచ్చిన వారు ఎన్టీఆర్ అని చెప్పారు. అలాగే మునిసిబ్, కరణం, పటేల్ పత్వారి వ్యవస్థలను రద్దు చేశారన్నారు. ఆడవారికి ఆస్తిలో వాటా ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, వారి స్ఫూర్తితోనే కేంద్రంలో బిల్ తీసుకొచ్చారని చెప్పారు. వ్యవసాయంలో మోటార్లకు 50 రూపాయలకు విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. నీటి పారుదలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. తమిళనాడుకు తెలుగు గంగ నీళ్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం అని ఇప్పుడు నడుస్తున్న పథకాలు ఇచ్చింది, తెచ్చింది ఎన్టీఆరేనని వివరించారు. 


ఎన్టీఆర్ హయాంలో స్వర్ణ యుగం చూశామని.. ఇప్పుడు సైకో పాలన చూస్తున్నామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎన్టీఆర్ వేసిన బాటలో అన్ని పార్టీలు నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు  పళ్ళ శ్రీనివాసరావు, పాలిట్ బ్యూరో  సభ్యులు వంగలపూడి అనిత పాల్గొన్నారు. 






చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాఫీ తాగితే.. 


అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై కూడా అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఆ ఇద్దరూ కలిసి ఓ కప్పు కాఫీ తాగారని... ఇది చూసిన వైసీపీ వాళ్లంతా మూడు చెరువుల నీళ్లు తాగారంటూ ట్వీట్ చేశారు. మరోవైపు చంద్రబాబు పవన్ కల్యాణ్ భేటీతో తాడేపల్లిలో సీఎం జగన్ కు బీపీ పెరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముందు ముందు బాహుబలులు చాలా మంది చంద్రబాబుని కలుస్తారని, అప్పుడు జగన్ కు హార్ట్ ఎటాక్ వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు టీడీపీ జనసేన కలయికను కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా వైసీపీ పాలనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలవాల్సిందే అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మంత్రులు హద్దులు మీరి మాట్లాడుతున్నారని ఆరోపించారు. 


"చంద్రబాబు, పవన్ గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ కు లేదు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏనాడైనా కోర్టు మెట్లు ఎక్కారా? , వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసు వేసి ఎందుకు డ్రాప్ అయిపోయారు. చంద్రబాబు అధికారంలో లేకపోయినా ప్రధాని కూడా ఆహ్వానిస్తు్న్నారు. పవన్ కల్యాణ్ ప్రజలకు సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ ఎలా సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారో ఇవాళ పవన్ కల్యాణ్ కూడా అలాగే రాజకీయాల్లో వచ్చారు. పవన్ ఏమైనా అవినీతి చేశారా? చంద్రబాబు పవన్ భేటీతో రాత్రి సీఎం జగన్ నిద్రపట్టుండదు. వణుకుపుట్టి ఉంటుంది. సీఎం జగన్ కు అధికారం పోతుందని బాధకాదు మళ్లీ జైలుకు పోవాలని ఆందోళన చెందుతున్నారు" - బండారు సత్యనారాయణ మూర్తి