Ram Mandir Opening:


అయోధ్యకి ఎక్కువ రైళ్లు..


అయోధ్య ఉత్సవానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటోంది ఇండియన్ రైల్వేస్. డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతుండడం వల్ల రైళ్ల వేళల్లోనూ మార్పులు చేస్తోంది. డిమాండ్‌కి తగ్గట్టుగా రైల్ సర్వీస్‌లను నడపడంతో పాటు ఎక్కువగా ఆలస్యం లేకుండా వాటిని షెడ్యూల్ చేసింది. కేంద్రమంత్రి దర్శన జర్దోష్ ఈ మేరకు ఓ అఫీషియల్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో ట్రైన్ టైమింగ్స్ వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ షెడ్యూల్‌ని పోస్ట్ చేశారు. సూరత్‌లోని ఉధ్నా స్టేషన్ నుంచి అయోధ్యకి జనవరి 30న ఓ ట్రైన్‌ అందుబాటులో ఉంది. ఆ తరవాత ఫిబ్రవరి 10వ తేదీన ఇండోర్ నుంచి అయోధ్యకి స్పెషల్ ట్రైన్‌ షెడ్యూల్ చేశారు. వడోదర, పలన్‌పూర్, వల్సాద్, సబర్మతి నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఏ ట్రైన్ ఏ రోజు బయల్దేరుతుందో షెడ్యూల్‌లో వెల్లడించారు. 






తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు రైళ్లు అయోధ్యకు చేరుకుంటాయి. యశ్వంతపుర నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు (15024) కాచిగూడ మీదుగా అయోధ్యకు వెళ్తుంది. ప్రతి శుక్రవారం ఉదయం 10.50 నిమిషాలకు గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15024) కాచిగూడలో బయల్దేరుతుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, అనంతపురం, కర్నూలు సిటీ, మహబూబ్ నగర్, కాచికూడా, ఖాజీపేట, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఆగుంది. 1690 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం సాయంత్రం 4.30కు అయోధ్య చేరుకుంటుంది. అలాగే తమిళనాడు లోని రామేశ్వరం నుంచి విజయవాడ  మీదుగా శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ (22613) అయోధ్యకు వెళ్తుంది. ఈ రైలు విజయవాడలో ప్రతి సోమవారం రాత్రి 8.10 గంటలకు బయల్దేరి 1813 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం తెల్లవారుజామున  4.00 అయోధ్య జంక్షన్‌కు  చేరుకుంటుంది. గూడూరు, విజయవాడ, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.  


జనవరి 19వ తేదీ నుంచి ఆ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచే ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అయోధ్యకు చేరుకునే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. జనవరి 23వ తేదీ నుంచి రామ మందిరాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కత్తా, నాగ్‌పూర్, లక్నో, జమ్ము నుంచి ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది రైల్వే. రోజుకు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు.


Also Read: I.N.D.I.A కూటమి ఛైర్మన్‌గా ఖర్గే, కన్వీనర్ పదవిని తిరస్కరించిన నితీశ్