China Zero-Covid:


మౌనమే సమాధానం..


చైనాలో కొవిడ్ మళ్లీ విస్తరిస్తోంది. వేలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జీరో కొవిడ్ పాలసీ అమలు చేసి వైరస్‌ను కట్టడి చేయాలని చైనా భావిస్తున్నా...అది మిస్‌ఫైర్ అవుతోంది. జీరోకొవిడ్ పేరుతో విధిస్తున్న కఠిన ఆంక్షలు ప్రజల్లో అసహనం పెంచుతున్నాయి. రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేసే వరకూ వచ్చాయి అక్కడి పరిస్థితులు. దీనిపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. కేవలం కరోనాను కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని గతంలోనే స్పష్టం చేసినా...ఆ సమాధానం ప్రజలకు నచ్చడం లేదు. మరీ ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటని మండి పడుతున్నారు. దీనిపై..చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్‌ వ్యవహరించిన తీరు మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో "దేశమంతా జీరోకొవిడ్ పాలసీపై వ్యతిరేకత వస్తోంది కదా. మరి ఆ విధానాన్ని మార్చుకుంటారా..?" అని ప్రశ్నించగా...చాలా సేపటి వరకూ మౌనంగా ఉండిపోయారు జావో. పోడియంపై అలాగే నిలుచుని పేపర్లు తిరగేస్తూ నిముషం పాటు సైలెంట్‌గా ఉన్నారు. మీడియా ప్రతినిధులంతా ఏం చెబుతారో అని ఎదురు చూశారు. కానీ...ఆయన మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఈ తీరు అందరినీ ఇబ్బంది పెట్టింది. నిముషం తరవాత "అదే ప్రశ్న మరోసారి అడగండి" అని అన్నారు. రిపోర్టర్ అదే ప్రశ్నను అడగ్గా..."మీరు చెప్పిన దానికి, అక్కడ జరిగిన దానికి సంబంధం లేకుండా ఉంది" అని అన్నారు. 






నిరసనలు..


జీరో కొవిడ్ పాలసీపై దేశమంతా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉరుమ్‌కీ ఏరియాలో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడికి సిబ్బంది చేరుకోడానికి మూడు గంటల సమయం పట్టింది. ఫలితంగా...మృతుల సంఖ్య పెరిగింది. కరోనా కఠిన ఆంక్షల వల్లే సిబ్బంది రావడం ఆలస్యమైందని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నిరసనల్లో..దాదాపు 10 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఉరుమ్‌కీ సిటీ వ్యాప్తంగా పోలీసులు పహారా కాస్తున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. అందరి ఫోన్‌లు చెక్ చేస్తున్నారు. కీలకమైన ప్రాంతాల్లో, చౌరస్తాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. కొన్ని నెలలుగా బ్రేక్ ఇచ్చిందనుకుంటున్న కరోనా...మరోసారి ఉద్ధృతమవుతోంది. పలు దేశాల్లో మళ్లీ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. కొవిడ్‌కు పుట్టినిల్లైనచైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆ దేశం ఇప్పటికే కొవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారిపోయింది. చైనాలోని పలు నగరాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తోంది ప్రభుత్వం. మాస్‌ టెస్టింగ్ నిర్వహించ డంతో పాటు ప్రయాణ ఆంక్షల్నీ విధించింది ఆ దేశం. జీరో కొవిడ్ పాలసీతో తమ దేశంలో కరోనా అదుపులోకి వచ్చిందని గతంలోనే ప్రకటించింది చైనా. కఠినమైన ఆంక్షలు విధించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని  నమ్ముతోంది. అందుకే..ఈ సారి కూడా ఇదే అస్త్రాన్ని 
ప్రయోగిస్తోంది. కాకపోతే...ఈ రూల్స్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 


Also Read: India-China Border: ఇది మా పర్సనల్ మ్యాటర్, మీ జోక్యం అవసరం లేదు - అమెరికాకు చైనా వార్నింగ్