Army chief: ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం- దేనికైనా రెడీగా ఉన్నాం: ఆర్మీ చీఫ్

ABP Desam   |  Murali Krishna   |  13 Nov 2022 02:14 PM (IST)

Army chief: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు.

ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Army chief: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ప్రస్తుత పరిస్థితులపై సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. 'ది చాణక్య డైలాగ్స్‌' నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చైనాతో సరిహద్దు సమస్యలపై కూడా ఆయన స్పందించారు. 

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద పరిస్థితి ఇప్పటికి నిలకడగానే ఉంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వివాదాస్పదమైన ఏడు ప్రదేశాల్లో నాలుగు చోట్ల సమస్య పరిష్కారమైంది. మిగిలిన రెండింటిపై దృష్టిపెట్టాం. కానీ, వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాల ఉపసంహరణ మాత్రం జరగడంలేదు. ప్రస్తుతం రెండు పక్షాల మధ్య దౌత్య, రాజకీయ, సైనిక స్థాయుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి చర్చల వల్లే మనం ఐదు చోట్ల పరిష్కారాలు కనుగొన్నాం.  -                                     జనరల్‌ మనోజ్‌పాండే, ఆర్మీ చీఫ్‌  

దేనికైనా రెడీ 

వివాదాస్పద ప్రదేశాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అంత వేగంగా జరగడం లేదని ఆర్మీ చీఫ్ అన్నారు. అయితే చర్చల వల్లే పరిష్కారం లభిస్తుందన్నారు.

కేవలం శిక్షణ కోసం వచ్చిన కొన్ని బ్రిగేడ్లు మాత్రమే వెనక్కివెళ్లాయి. ఎల్‌ఏసీని దృష్టిలో పెట్టుకొని చూస్తే మాత్రం పెద్దగా బలగాల సంఖ్యలో తగ్గుదల ఏమీ లేదు. భారత్‌ వైపు నుంచి మౌలిక వసతుల కల్పన , అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రిజర్వు బలగాలను సిద్ధంగా ఉంచాం.                           - జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్

రక్షణ మంత్రి

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల ఆర్మీ కమాండర్లను హుటాహుటిన పిలిచి మీటింగ్ పెట్టారు. తూర్పు లద్దాఖ్ వద్ద ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అత్యున్న స్థాయిలో అన్ని వ్యూహాలూ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మిలిటరీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో భారత సైన్యంపై ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్. దేశ భద్రతకు కట్టుబడి ఉన్న సైనికులందరికీ కితాబునిచ్చారు.

"భారత సైన్యంపై, వారి నాయకత్వంపై మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఎలాంటి ఆపరేషన్లు చేపట్టేందుకైనా మనం సిద్ధంగా ఉండాలి" అన్నారు రాజ్‌నాథ్. ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాడుతున్న సైన్యం నిబద్ధతను పొగిడారు. ఆత్మనిర్భరత సాధించేందుకు అవసరమైన సాంకేతికతను అందిపుచ్చుకోవటాన్నీ ప్రశంసించారు.  

భారత్, చైనా మధ్య దాదాపు రెండేళ్లుగా యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న వివాదం క్రమంగా పెరుగుతూ వచ్చింది. గల్వాన్ ఘటన తరవాత అది తారస్థాయికి చేరుకుంది. చర్చలు జరుగుతున్నా చైనా ఏ మాత్రం వాటిని లెక్కలోకి తీసుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీంతో డ్రాగన్‌కు గట్టి బదులు ఇచ్చేందుకు భారత్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తుంది.

Also Read: Australia Cruise Ship Covid: మళ్లీ కరోనా కలకలం- ఆ నౌకలో 800 మందికి వైరస్!

Published at: 13 Nov 2022 02:06 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.