PAK vs ENG T20 WC Final: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో ఎప్పుడేం జరుగుతుందో అర్థమవ్వడం లేదు! అసలు మ్యాచ్ జరుగుతుందా అన్న సందిగ్ధం నెలకొంది. ఎందుకంటే వారం రోజుల పాటు మెల్బోర్న్కు వర్ష సూచన కనిపిస్తోంది. శుక్ర, శనివారాల్లో అక్కడ వాన పడింది. రాత్రంతా జల్లులు కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. ఆదివారం ఉదయం నుంచి వర్షం ఆగిపోవడంతో నిర్వాహకులు ఇప్పటికైతే ఆనందంగా ఉన్నారు. అయితే ఆకాశం నిండా దట్టమైన మేఘాలు అలుముకోవడంతో ఆందోళనకూ గురవుతున్నారు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. అరగంట ముందు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో వాతావరణం ప్రశాతంగా ఉంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ లానినా ప్రభావం వల్ల ఎప్పుడైనా వరుణుడు బ్యాటింగ్కు దిగే అవకాశం ఉంది.
'ఆకాశం మేఘావృతమైంది. వర్షం కురిసే అవకాశాలు (100%) ఎక్కువగా ఉన్నాయి. భీకరమైర ఉరుములు, మెరుపులతో వాన పడనుంది. తూర్పు నుంచి ఈశాన్యం వైపు 15-25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరం నుంచి ఆగ్నేయం వైపు 25-35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సాయంత్రం 15 నుంచి 20 కిలోమీటర్లకు తగ్గుతాయి' అని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించింది.
ఒకవేళ ఆదివారం మ్యాచ్ జరగకపోతే రిజర్వు డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ముందు జాగ్రత్తగా సమయాన్ని రెండు గంటలు ముందుకు జరిపారు. అంటే స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటలకు ఆట మొదలవుతుంది. దురదృష్టం ఏంటంటే సోమవారమూ జల్లులు పడేందుకు 95 శాతం ఆస్కారం ఉంది. 5 నుంచి 10 మి.మీ. వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు.