Annamayya District News: వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇదే విషయాన్ని ఇద్దరు ఇళ్లలో చెప్పారు. అయితే అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పటికీ మతాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ మతం మారితే తమకు ఏం అభ్యంతరం లేదని చెప్పారు. కానీ ఆ అబ్బాయి అందుకు ఒప్పుకోకపోవడంతో.. ఆగ్రహానికి లోనైన అమ్మాయి తల్లి యువకుడిపై కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నాడు. 


అసలేం జరిగిందంటే..?


అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్ కు చేందిన రెడ్డి ప్రసాద్ స్థానికంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. బాబాజన్, రిహానా దంపతుల‌ కుమార్తె సప్రిన్ తో రెడ్డి ప్రసాద్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నప్పటికీ.. బాబాజన్, రిహానా దంపతులు ఒప్పుకోలేదు. అయినా వాళ్లు పట్టు వదలకుండా తరచుగూ అడుగుతుండడంతో.. అమ్మాయి తల్లి కొన్ని షరతులు పెట్టింది. అందుకు అబ్బాయి అంగీకరిస్తే తామే దగ్గరుండి పెళ్లి చేస్తామని చెప్పింది. రెడ్డి ప్రసాద్ మతం మారితే తన కూతురితో వివాహం జరిపిస్తామని కండీషన్ పెట్టింది. 


మతం మారేందుకు రెడ్డి ప్రసాద్ ఒప్పుకోలేదు. దీంతో రెడ్డి ప్రసాద్ పై కోపం పెంచుకున్న రిహానా.. తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించేందుకు ఒప్పుకోమని తేల్చి చెప్పింది. ఈ విషయమై రెడ్డిప్రసాద్ కు ప్రియురాలు తల్లి రిహానాకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈరోజు అబ్బాయికి, రిహానాకు మరోసారి వాగ్వాదం జరగడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె కాబోయే అల్లుడిపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో రెడ్డి ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన స్థానికులు.. రక్తపుమడుగులో పడి ఉన్న రెడ్డి ప్రసాద్ ను మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులతో పాటు రెడ్డి ప్రసాద్ కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న రెడ్డి ప్రసాద్ కుటుంబ సభ్యులు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ప్రేమించిన ఫుడ్‌ డెలివరీ బాయ్, నో చెప్పిందని హత్యాయత్నం


పెళ్లికి నో చెప్పిందని అమ్మాయి గొంతు కోసిన యువకుడు 
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన 22 ఏళ్ల వాసవి సాప్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తూ హైదరాబాద్ గచ్చిబౌలిలోని హాస్టల్‌లో నివసిస్తోంది. ఆమె సమీప బంధువు చిలకలూరిపేటకు చెందిన 27 ఏళ్ల కొత్త గణేష్ గచ్చిబౌలిలోని ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో బాయ్ గా పని చేస్తున్నాడు. వాసవిని పెళ్లి చేసుకోవాలని గతంలో గణేష్ ప్రతిపాదించగా.. ఆమె తిరస్కరించింది. మంగళవారం రోజు రాత్రి వాసవి హాస్టల్ లో ఉండగా... ఆమెను పిలిచి బైక్ పై ఓ హోటల్ వద్దకు తీసుకెళ్లాడు.


మరోసారి గణేష్ తన ప్రేమ సంగతి చెప్పాడు. పెళ్లి చేసుకుందామని  ప్రతిపాదన తీసుకువచ్చాడు. మళ్లీ వాసవి నో చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో గణేష్ తన బ్యాగులోని కత్తి తీసి వాసవిపై దాడికి పాల్పడ్డాడు. యువతి గొంతుతోపాటు ముఖం, చేతులపైన వేటు వేశాడు. అయితే విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా... నిందితుడిని నార్సింగి పోలీసులకు అప్పగించారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial