2 Farmer dies after having paan in Annamayya District: హిందూ‌ సాంప్రదాయం‌ ప్రకారం తాంబూలానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాల దగ్గర నుండి ఏ చిన్న కార్యం జరగాలన్నా తాంబూలం తప్పని సరిగా ఉపయోగిస్తారు. ఇక తాంబూలం ఎర్రగా పండితే మంచి జీవిత భాగస్వామి వస్తుందని పెద్దలు అంటుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాంబూలంను తరచూగా తీసుకుంటూ ఉంటారు. తాజాగా పొలం పనులు చేసుకుంటూ తాంబూళం వేసుకున్న ఇద్దరు రైతుల ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నమయ్య జిల్లా ( Annamayya District )లో తీవ్ర విషాదంను మిగిల్చింది. తాంబూలం వేసుకుంటే ప్రాణాలు పోవడం ఏంటని పోలీసులు మిస్టరీని ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని గూండావారిపల్లిలో కృష్ణప్ప(45), కనకరాజు(36) లు బావా, బామర్దులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం‌ సాగించేవారు. ఉదయం నిద్ర లేచింది మొదలుకుని చీకటి‌పడే వరకూ‌ పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేవారు. చీకటి‌ పడితే గానీ వీరిద్దరూ ఇంటికి తిరిగి వెళ్లేవారు కాదు. అయితే రోజు వారిలాగే శనివారం ఉదయం బావా, బామర్దులు పొలం‌ పనుల నిమిత్తం పొలం వద్దకు బయలుదేరారు. పోతూ పోతూ మార్గం మధ్యలో ఒకచోట కూర్చుని తమలపాకులు, సున్నం, వక్కలు కలిపి తాంబూలం‌ వేసుకున్నారు. తాంబూలం తిన్నాక అటు నుంచి పొలం వద్దకు చేరుకున్నారు. తాంబూలం తిన్న కొన్ని‌ నిమిషాలకే కృష్ణప్ప సృహ కోల్పొయి కింద‌ పడి‌పోయాడు.‌ దీంతో ఆందోళన చేందిన కనకరాజు హుటాహుటిన గుండావారిపల్లికు వెళ్లి బంధువులను తీసుకొని వచ్చేందుకు గ్రామానికి వెళ్లాడు. 
బంధువులను తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తి సైతం..
బంధువులను వెంట తీసుకొచ్చేందుకు వెళ్ళిన కనకరాజు కూడా సృహ కోల్పోయి పడి పోవడంతో  గమనించిన కుటుంబ సభ్యులు ఇరువురిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని పరిక్షించిన వైద్యులు మృతి చెందారని నిర్ధారించారు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలోకి మునిగి పోయాయి. కృష్ణప్ప భార్య నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. ఇదే విషయంపై మదనపల్లి తాలూకా సీఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణప్ప భార్య నాగరత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తాంమని మదనపల్లె తాలూకా సీఐ సత్యనారాయణ వెల్లడించారు.


తాంబూలంలో ప్రధానంగా తమలపాకులు, వక్క సున్నం ఉంటాయి. అయితే తమ అభిరుచుల మేరకు అనేక ఇతర పదార్థాలను కూడా తాంబూలంలో వాడుతూంటారు. వీటిలో జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము లాంటి వస్తువులున్నాయి. కలకత్తా పాన్, హైదరాబాద్ పాన్, ఢిల్లీ పాన్, స్వీట్ పాన్, హాట్ పాన్ ఇలా ప్రాంతాన్ని బట్టి కిళ్లీలకు పేర్లు ఉన్నాయి. కానీ తాంబూలం వేసుకున్నాక ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జిల్లాలో కలకలం రేపుతోంది. వారు తిన్న కిళ్లీలో ఏవైనా విష పూరిత పదార్థాలు కలిశాయా, లేక వారిద్దరూ పాన్ తిన్నాక ఇంకేమైనా తిన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.