అత్యంత ప్రమాదకరమైన స్టంట్ ఇది: ఆనంద్ మహీంద్రా


సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా రోజుకో వీడియో పోస్ట్ చేసి నెటిజన్లను అలరిస్తుంటారు. చాలా సందర్భాల్లో ఫన్నీ వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిపై నెటిజన్లు ఇచ్చే కామెంట్లకు, రిప్లైలు కూడా ఇస్తారు. ఈ క్రమంలోనే ఆయన ట్విటర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. "ఇది చాలా ప్రమాదకరం" అనే ట్యాగ్‌తో వీడియోను పోస్ట్ చేశారు. మహీంద్రా కంపెనీ ఎస్‌యూవీ థార్‌కు మంచి స్పందనే వచ్చింది. చాలా మంది ఈ వెహికిల్‌ను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులు ప్రమాదకరమైన పరిస్థితుల్లో థార్‌ను నడిపిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. గోవాలోని ఓ నది ఉప్పొంగుతుంటే...ఆ నీళ్ల మధ్య నుంచే థార్‌ను నడిపారు. ప్రమాదం అని తెలిసినా లెక్క చేయకుండా అలాగే వెళ్లిపోయారు. ఏ మాత్రం పట్టు తప్పినా నీళ్లలో పడి కొట్టుకుపోయేవి. "థార్‌పై మీకున్న నమ్మకానికి ఆనందిస్తున్నాను. కానీ..ఇలాంటివి ఎంతో ప్రమాదకరం. దయచేసి ఇలాంటి సాహసాలు చేయకండి" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. "అత్యంత ప్రమాదకరం" అని కొందరు కామెంట్ చేస్తుంటే..."ఇలాంటి వాటిని తప్పకుండా కంట్రోల్ చేయాలి" అని మరికొందరు అంటున్నారు. 2020లో మహీంద్రా సంస్థ థార్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఇది మార్కెట్‌లో బెస్ట్ ఎస్‌యూవీగా అమ్ముడవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 వేల యూనిట్లను అమ్మినట్టు అంచనా.