China Coronavirus Cases: దేశంలో కరోనా అలర్ట్- ప్రజలకు ఆరోగ్యశాఖ కీలక సూచనలు

ABP Desam   |  Murali Krishna   |  21 Dec 2022 04:58 PM (IST)

China Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది.

రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

China Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి మరోసారి తన కోరలు చాచుతూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ప్రకటన చేసింది.

నిబంధనలు

వైరస్ వ్యాపించకుండా రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. కోమోర్బిడిటిస్‌తో బాధపడే  పెద్దవాళ్ళ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రికాషన్ డోసులు తీసుకోవాలని తెలిపింది. విదేశీ ప్రయాణాల విషయంలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవీయ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం  నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ మాట్లాడారు.

మీరు బయటి ప్రదేశాలు, రద్దీ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మాస్క్ తప్పకుండా ధరించండి. కొమోర్బిడిటిస్‌తో బాధ పడుతున్నవాళ్ళు,పెద్ద వాళ్ళు ఇది పాటించడం చాలా ముఖ్యం. కేవలం 27-28 శాతం ప్రజలు మాత్రమే ప్రికాషన్ డోసులు తీసుకున్నారు. నేను అందరనీ మరి ముఖ్యంగా పెద్ద వయస్సు వ్యక్తులను ప్రికాషన్ డోస్ తీసుకోవాలని కోరుతున్నాను. ప్రికాషన్ డోస్ తీసుకోవడం అందరికి ముఖ్యం.                                                  -  వీకే పాల్, నీతి అయోగ్ సభ్యుడు 

మళ్లీ కేసులు

అమెరికా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని నివేదికలు వస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా పరిస్థితులపై అధికారులు, నిపుణులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ బుధవారం  సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి ఆగిపోలేదని తెలుపుతూ సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారి చేసారు.

పలు దేశాల్లో కరోనా కేసులు పెరుతున్న నేపథ్యంలో అధికారులు, నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించాం. కరోనా వ్యాప్తి అప్పుడే అయిపోలేదు. అన్ని శాఖల ఆధికారులు అప్రమత్తంగా ఉండి ఎపట్టికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితిని అయిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలి.                                        - మన్‌సుక్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఈ మంగళవారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అలర్ట్‌ చేస్తూ లేఖలు రాశారు. 2019 లో ప్రారంభమై దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించి, వారి జీవితాలను అతలాకుతలం చేసింది కరోనా. వైరస్ సంక్షోభం ధాటికి అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు పతనమయ్యాయి. ప్రపంచ దేశాల ప్రజలు వరుస లాక్ డౌన్‌లు, కొవిడ్ నిబంధనల మూలంగా ఇళ్లకే పరిమితమై అనేక ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇన్ని అవస్థలకు గురి చేసిన కరోనా వైరస్ మళ్ళీ తన ప్రతాపం చూపిస్తోంది.

Also Read: China Coronavirus Cases: ఈ వీడియో చూస్తే.. మీ మూతికి మాస్క్ వస్తుంది, చేయి శానిటైజర్ పట్టుకుంటుంది!

Published at: 21 Dec 2022 04:58 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.