Amazon Return-to-Office Policy:



రిటర్న్ టు ఆఫీస్..


అమెజాన్‌ రిటర్న్ టు ఆఫీస్ (Amazon return-to-office policy) పాలసీపై చాలా స్ట్రిక్ట్‌గా ఉంటోంది. వారానికి మూడు రోజుల పాటు కచ్చితంగా ఆఫీస్‌కి రావాల్సిందే అని రూల్ పెట్టింది. కానీ కొందరు ఉద్యోగులు ఈ రూల్‌ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే అమెజాన్ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వారానికి మూడు రోజులు ఆఫీస్‌కి రాని ఉద్యోగులను తొలగించే అధికారాలను మేనేజర్‌లకి ఇచ్చింది. అటెండెన్స్‌ రిక్వైర్‌మెంట్‌కి తగ్గట్టుగా పని చేయని ఉద్యోగులను ఇంటికి పంపేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎంత కచ్చితంగా ఉందో ఈ నిర్ణయాన్ని బట్టే అర్థమవుతోంది. ఇప్పటికే అమెజాన్ గ్లోబల్ మేనేజర్ గైడెన్స్‌ని అప్‌డేట్ చేసింది. సంస్థలోని ఇంటర్నల్ పోర్టల్‌లో మేనేజర్‌లందరికీ ఈ అప్‌డేట్‌ని షేర్ చేసినట్టు Insider రిపోర్ట్‌లు వెల్లడించాయి. ఉద్యోగులందరూ వారానికి మూడు రోజులు కచ్చితంగా ఆఫీస్‌కి వచ్చేలా చూసుకోవాలని ఆర్డర్ వేసింది కంపెనీ. అయితే...ఒకేసారి తొలగించకుండా దీనికో ప్రాసెస్‌ని కూడా పెట్టింది. ముందుగా మేనేజర్‌లు ఎంప్లాయీస్‌తో ప్రైవేట్‌గా మాట్లాడాలి. ఇదంతా ఈమెయిల్‌ ద్వారా కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. అప్పటికీ ఉద్యోగులు ఆఫీస్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపించకపోతే మరోసారి మాట్లాడాలి. ఇదంతా రెండు వారాల్లోగా పూర్తవ్వాలి. ఈ మీటింగ్‌లోనే మేనేజర్‌లు ఉద్యోగులను కన్విన్స్ చేయాలి. వాళ్లు తప్పనిసరిగా ఆఫీస్‌కి వచ్చేలా చూడాలి. కచ్చితంగా రావాలని వార్నింగ్ ఇవ్వాలని కంపెనీ ఆదేశించింది. ఇక లాస్ట్‌ స్టేజ్‌లో HR డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులకు లెటర్‌ పంపి టర్మినేట్ చేయాలని తేల్చి చెప్పింది. ఈ ఏడాది మే నెల నుంచే ఈ పాలసీ తీసుకొచ్చింది అమెజాన్. అయితే..ఉద్యోగుల నుంచి కొంత అసహనం వ్యక్తమైంది. అయినా తప్పనిసరిగా ఫాలో అవ్వాలని చెప్పింది. రీలోకేట్ అవ్వని ఉద్యోగులు వాలంటరీ రిజిగ్నేషన్‌ ఇచ్చేయాలని స్పష్టం చేసింది. 


మెటా కూడా..


ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తన ఉద్యోగులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రాకుంటే ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని స్పష్టంచేసింది. ఈ మేరకు మెటా మానవ వనరుల అధిపతి లోరీ గోలెర్‌ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. సంస్థ లక్ష్యం ఉద్యోగుల మధ్య మంచి అనుబంధం, బలమైన టీమ్‌ వర్క్‌ను ప్రోత్సహించడమే అని నోటీసుల్లో పేర్కొన్నారు.  ఉద్యోగులు సంస్థ సూచనలను పాటిస్తున్నారా..? లేదా..? అన్నది మేనేజర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 'వర్క్‌ ఫ్రమ్‌ హోం' విధానాన్ని అమలుచేశాయి. ప్రస్తుతం కరోనా పరిస్థితులు లేనప్పటికీ చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చిన పని చేసేందుకు సుముఖంగాలేరు. కొన్ని కంపెనీలు వారంలో మూడు రోజులైనా తప్పనిసరిగా ఆఫీస్‌ నుంచే వర్క్‌ చేయాలని కోరుతున్నాయి.దీన్ని చాలా మంది ఉద్యోగులు పట్టించుకోవడంలేదు. దీంతో ఉద్యోగులను తప్పనిసరిగా వారంలో మూడు రోజులు ఆఫీస్‌ నుంచే పని చేయాలని మెటా సంస్థ ఉద్యోగులను ఆదేశించింది. 


Also Read: కాలేజ్‌లో స్టేజ్‌పై జై శ్రీరామ్ నినాదాలు, స్టూడెంట్స్‌కి వార్నింగ్ ఇచ్చిన లెక్చరర్