తెలంగాణలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. గత ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శిగా పని చేసిన ఆమె.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారితో దూరంగా ఉంటున్నారు. కనీసం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలవలేదని విమర్శలు ఉన్నాయి. ఆమె కేంద్ర సర్వీసుల్లోకి డిప్యుటేషన్ పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె గురించి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పందించడం చర్చనీయాంశం అయింది.


ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి వెళ్లి, ఇక్కడి తప్పుల నుంచి తప్పించుకోవడం కొంత మంది ఐఏఎస్‌లకు ఫ్యాషన్ అయిపోయిందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రానికి పంపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని విమర్శించారు. దేశంలో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ ఆకునూరి మురళి స్మితా సబర్వాల్‌పై ఆరోపణలు చేశారు. 


‘‘అప్పటి ప్రభుత్వం లో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వం కు వెళ్లి ( అక్కడి caste కనెక్షన్స్ network వాడుకొని ) ఇక్కడి తప్పులను తప్పించుకోడం fashion అయ్యింది కొంత మంది IAS ఆఫీసర్లకు. తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రం కు పంపకుండా చర్యలు తీసుకోవాలి. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం.. దేశం మొత్తం లో హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను inspection చేసే ఏకైక IAS ఆఫీసర్ ఈమె మాత్రమే’’ అని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు.


కేసీఆర్ ప్రభుత్వంలో స్మిత సబర్వాల్ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆమె కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులను కూడా పర్యవేక్షించారు. సీఎంవో కార్యదర్శిగా పని చేశారు. కానీ, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన్ను ఇప్పటి వరకు మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఏదైనా సరే కొత్త ఛాలెంజ్‌లకు తాను ఎప్పుడూ సిద్దం అంటూ స్మిత సబర్వాల్ ట్వీట్ చేశారు.


2001లో ట్రైనీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన స్మితా సబర్వాల్.. మెదక్ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. పని తీరు విషయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు పొందారు. తద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.