Telangana CM Singapore Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సాగుతోన్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం రెండో రోజు సింగపూర్ పర్యటన విజయవంతమైంది. మొత్తం రూ. 3500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. రెండో రోజు సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు సింగపూర్లోని ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ఆఫీస్ ను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎస్ టీటీ గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు.
అత్యాధునిక సౌకర్యాలతో ఏఐ ఆధారిత డేటా సెంటర్
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులపై పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ లో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ ను నెలకొల్పేందుకు చర్చలు సఫలమయ్యారు. ఈ క్యాంపస్ ను ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్ పేటలో స్థాపించేందుకు ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకుంది.
100 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఈ అత్యాధునిక అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ను ఈ కంపెనీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నెలకొల్పనుంది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచుకునే సదుపాయం కల్పించనుండగా.. ఇది నెరవేరితే దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు రూ. 3,500 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నందున తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలను, ప్రపంచస్థాయి అనుకూలతలను మరింత మెరుగుపర్చనున్నారు.
డేటా సెంటర్లకు హైదరాబాద్ రాజధానిగా అవతరిస్తుందన్న సీఎం
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. త్వరలోనే హైదరాబాద్ డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం తీసుకున్నందుకు ఎస్టీటీ గ్లోబల్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు. ఈ క్రమంలోనే ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఈవో బ్రూనో లోపెజ్ మాట్లాడుతూ.. తెలంగాణతో కలిసి పని చేయటం గౌరవంగా ఉందని చెప్పారు. మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రగతిశీల విధానాలు, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పన, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తు నిర్మించాలనే ఉమ్మడి లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు.
డేటా హబ్ గా మారనున్న హైదరాబాద్
ప్రపంచానికి హైదరాబాద్ డేట్ హబ్ గా మారనుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగంలో వస్తోన్న వినూత్న మార్పుల్లో హైదరాబాద్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆ తర్వాత శ్రీధర్ బాబు సెమీ కండక్టర్ అసోసియేషన్ సమావేశమై, ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం, ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు తెలంగాణ కేంద్రంగా నిలుస్తుందన్నారు.
ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ గురించి
ప్రస్తుతం ఈ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో కంపెనీ ఈ కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. ఈ కంపెనీ పదేండ్లలో మన దేశంలో ఒక గిగావాట్ సామర్థానికి విస్తరించాలనే భవిష్యత్తు లక్ష్యంతో తెలంగాణలో పెట్టుబడులు పెడుతుండగా.. దశాబ్దంలో ఈ కంపెనీ దాదాపు 3.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read : Hyderabad Outer Ring Rail Project: రీజినల్ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్లో మరో బిగ్ ప్రాజెక్టు