Afghanistan News: 'అఫ్గాన్'లో ఇక కో-ఎడ్యుకేషన్ బంద్.. తాలిబన్ల సంచలన ప్రకటన

ABP Desam   |  Murali Krishna  |  12 Sep 2021 08:08 PM (IST)

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తాలిబన్లు కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ కు అనుమతించబోమని తెలిపారు.

Afghanistan News: 'అఫ్గాన్'లో ఇక కో-ఎడ్యుకేషన్ బంద్.. తాలిబన్ల సంచలన ప్రకటన

అఫ్గానిస్థాన్ లో కో-ఎడ్యుకేషన్ ఇక బంద్.. తాలిబన్ల ప్రకటన

అఫ్గానిస్థాన్ లో అధికారంలోకి వచ్చినా తర్వాత తాలిబన్లు ఒక్కొక్కటిగా తమ విధానాలను ప్రకటిస్తున్నారు. మహిళలపై తమ వైఖరి మారిందని ఇప్పటివరకు పైకి చెప్పిన తాలిబన్లు.. తాజాగా చేస్తోన్న ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. తాలిబన్ల సర్కార్ లో విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

పురుషులతో సంబంధం లేకుండా మహిళలు చదువుకోవడానికి సిద్ధమయ్యే వరకు వారికి యూనివర్సిటీల్లోకి అనుమతి లేదని ఆయన చెప్పుకొచ్చారు.

కో-ఎడ్యుకేషన్ కు స్వస్తి పలకడంలో మాకు ఎలాంటి సమస్యలు లేవు. ఇక్కడున్నవారు అందరూ ముస్లింలే.. వారు దీనికి అంగీకరిస్తారు. తాలిబన్ల రాజ్యంలో పాఠశాలలు, యూనివర్సిటీల్లో వారికి అనుమతి లేని కాలం నుంచి ప్రస్తుతం విద్యావిధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులను మేం స్వాగితిస్తున్నాం. వారి వదిలేసిన దగ్గర నుంచి మేం కొనసాగిస్తాం.                                           - అబ్దుల్ బాకీ హక్కానీ, తాలిబన్ సర్కార్ లో విద్యాశాఖ మంత్రి 

డ్రెస్ కోడ్ లు..

చదువుకునే మహిళలు కచ్చితంగా ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ పాటించాలని తాలిబన్‌ ప్రభుత్వం తెలిపింది. 1990ల నాటి పాలనలో తాలిబన్లు మహిళలను చదువుకోవడానికి అనుమతించలేదు. వారిని పూర్తిగా ఇంటికే పరిమితం చేశారు. దీంతో తాలిబన్లు మరోసారి అధికారంలోకి రాగానే నాటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అంతా ఆందోళన చెందారు. అయితే, తమ పాలన క్రితంతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని తాలిబన్లు చెప్పుకొస్తున్నారు.

తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హాషిమి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.

మహిళలు మంత్రులు కాలేరు. ఇలాంటి బాధ్యత వారికి అప్పగిస్తే.. తలపై మోయలేనంత బరువు మోపినట్లే అవుతుంది. వారు పిల్లలకు జన్మనిస్తే చాలు. మహిళా నిరసనకారులు దేశంలోని మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించలేరు.                                     - సయ్యద్ జెక్రుల్లా హాషిమి, తాలిబన్ల అధికార ప్రతినిధి

ప్రమాణస్వీకారం వాయిదా..

అఫ్గానిస్థాన్‌లో సెప్టెంబర్‌ 11న జరగాల్సిన మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని తాలిబన్లు ఇటీవల వాయిదా వేసుకున్నారు. గతంలో న్యూయార్క్‌ ట్విన్‌ టవర్స్‌ను కూల్చిన రోజు (9/11) ప్రమాణస్వీకారం నిర్వహించాలని చూసినప్పటికీ మిత్రపక్ష దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది వెల్లడించలేదు.

Published at: 12 Sep 2021 08:08 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.