Adani Hindenburg Case:


సీల్డ్‌కవర్‌లో పేర్లు..


అదాని హిండన్‌బర్గ్ కేసు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణకు ప్రత్యేక కమిటీ నియమించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు SEBI కొందరి పేర్లను ప్రతిపాదించింది. SEBI తరపున వాదించే సోలిసిటర్ జనరల్ ఈ వివరాలు కోర్టుకి సమర్పించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కమిటీకి లీడర్‌గా నియమించే నిర్ణయం కోర్టుదేనని తేల్చి చెప్పారు సోలిసిటర్ జనరల్. అయితే...SEBI ప్రతిపాదించిన పేర్ల జాబితాను సీల్డ్‌ కవర్‌లో అందించడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కమిటీలో సభ్యులు ఎవరు ఉండాలో కోర్టే నిర్ణయిస్తుందని, అలా అయితే తప్ప పారదర్శకత ఉండదని తేల్చి చెప్పింది. 


"మేం ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను ఆమోదిస్తే అది ప్రభుత్వం నియమించిన కమిటీ అయిపోతుంది. ఈ కమిటీపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలి" 


-సుప్రీంకోర్టు  ధర్మాసనం










ప్రస్తుతం విధుల్లో ఉన్న సుప్రీంకోర్టు జడ్జ్‌ నేతృత్వంలో కమిటీని నియమించలేమని, ఆ బాధ్యతను మాజీ జడ్జ్‌కే అప్పగిస్తామని స్పష్టం చేసింది  ధర్మాసనం. 


కేంద్రం వివరణ..


ఫిబ్రవరి 10 వ తేదీన సుప్రీం కోర్టు "ప్రత్యేక కమిటీ" నియమించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అంగీకరించిన కేంద్రం ఆ కమిటీలోని సభ్యుల పేర్లనూ కోర్టు ముందుంచింది. అయితే...ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కమిటీ నియమించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ SEBI అన్ని విధాలుగా పారదర్శకంగా ఉందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలతో ప్రస్తుత సమస్యని పరిష్కరించవచ్చని వెల్లడించింది. ప్యానెల్‌లో ఎవరెవరుంటారో వాళ్ల పేర్లను సీల్డ్‌కవర్ ద్వారా వెల్లడించేందుకు అనుమతించాలని సుప్రీం కోర్టుని కోరింది. కానీ...సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించడం లేదు. 


అమిత్‌షా స్పందన..


వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, హిండెన్‌బర్గ్ నివేదికపై మన దేశంలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదానీ సమస్య గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లిందని తెలిపారు. ఇందులో బీజేపీకి దాపరికం లేదని, భయపడాల్సిన పని లేదని అన్నారు. సుప్రీం కోర్టులో ఈ అంశం ఉన్నందున, కేబినెట్ లో ఉన్న తాను ఈ సమయంలో ఈ అంశంపై ఏమీ మాట్లాడటం సరికాదని అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేయడం మాత్రమే తెలుసని అమిత్ షా అన్నారు. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని చెప్పారు.


Also Read: Nepal Plane Crash: నేపాల్‌ విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమా? కమిటీ ఏం చెప్పిందంటే!