Galwan Tweet: సైన్యానికి సారీ చెప్పిన బాలీవుడ్ నటి- గల్వాన్ ట్వీట్‌పై దుమారం!

ABP Desam   |  Murali Krishna   |  24 Nov 2022 04:14 PM (IST)

Galwan Tweet: గల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన కామెంట్లపై విమర్శలు రావడంతో ఆమె క్షమాపణలు కోరింది.

(Image Source : Twitter/@RichaChadha)

Galwan Tweet: గల్వాన్‌పై బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపాయి. దీంతో భారత ఆర్మీకి ఆమె ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. 'గల్వాన్ హాయ్ చెబుతోంది' అంటూ తాను చేసిన కామెంట్ ఎవరినైనా బాధించి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు ఆమె ఓ ట్వీట్ చేశారు.

ఇది నా ఉద్దేశం కానప్పటికీ.. వివాదంలోకి లాగుతున్న 3 పదాలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. అనుకోకుండా నా మాటలు చాలా మంది బాధించినందుకు నాకు బాధ కలుగుతోంది. సైన్యంలోని నా సోదరులకు నా క్షమాపణలు చెబుతున్నాను. నా సొంత నానాజీ లెఫ్టినెంట్ కల్నల్‌గా భారత ఆర్మీలో విశిష్ట సేవలు అందించారు. 1960లో జరిగిన ఇండో-చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్ కూడా తగిలింది. నా మామాజీ ఒక పారాట్రూపర్. కనుక ఆర్మీపై గౌరవం నా రక్తంలోనే ఉంది.              -    రిచా చద్దా, బాలీవుడ్ నటి 

ఇదీ సంగతి

గల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా ఇటీవల ఓ ట్వీట్ చేసింది. ప్ర‌భుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ సిద్ధంగా ఉన్న‌ట్లు నార్త‌ర్న్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఆ ప్ర‌క‌ట‌న‌పై రిచా స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది.

'గల్వాన్ హాయ్ చెబుతోంది' అంటూ కామెంట్ చేసింది. ఆ వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు దుమారం చెల‌రేగుతోంది. రిచా చేసిన కామెంట్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. భార‌తీయ ఆర్మీని చాలా చుల‌క‌న చేసిన‌ట్లు కొంద‌రు ఆరోపించారు. ఆ వ్యాఖ్య‌లు సిగ్గుచేటు, అవ‌మాన‌క‌రం అని కొంద‌రు కామెంట్ చేశారు.

2020 మే లో గల్వాన్‌లో చైనా, భార‌త ఆర్మీ ద‌ళాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఆ ఘర్షణలో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణా త్యాగం చేశారు. ఆ గల్వాన్ అమ‌ర‌వీరుల‌ను రిచా త‌న ట్వీట్‌తో అవ‌మాన‌ప‌రిచిన‌ట్లు ఉంద‌ని విమర్శలు వచ్చాయి.

కేసు

తాజాగా సినీ నిర్మాత అశోక్ పండిట్ రిచా చద్దాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భద్రతా బలగాలను అవమానించినందుకు జుహు పోలీస్ స్టేషన్‌లో ఆయన రిచాపై ఫిర్యాదు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని వెనక్కి తీసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది చేసిన వ్యాఖ్యలపై రిచా చేసిన కామెంట్‌పై ఆయన ఈ ఫిర్యాదు చేశారు.

శత్రువులతో పోరాడుతూ గల్వాన్ లోయలో ప్రాణత్యాగం చేసిన మన భద్రతా దళాలను అవమానించినందుకు నటి రిచా చద్దాపై ఈ గొప్ప దేశానికి చెందిన పౌరుడిగా నేను ఫిర్యాదు చేస్తున్నాను. ఈ నేరపూరిత చర్య ద్వారా ఆమె మన భద్రతా దళాల కుటుంబాలను అవమానించారు. ఇది దేశానికి విరుద్ధమైన చర్య కాబట్టి దేశ అంతర్గత భద్రతకు వ్యతిరేకంగా కుట్ర పన్నినందుకు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.                        -  అశోక్ పండిట్, సినీ నిర్మాత

Also Read: Delhi Jama Masjid: సంచలన నిర్ణయం- ఇక సింగిల్‌గా వస్తే మహిళలకు జామా మసీదులోకి నో ఎంట్రీ!

Published at: 24 Nov 2022 04:08 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.