యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిపై డ్రోన్ దాడులు కలకలం సృష్టించాయి. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు సమాచారం. యెమన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటు సంస్థ డ్రోన్‌ దాడులు చేసినట్లు ఒప్పుకుంది.






ఎలా జరిగింది?


ప్రధాన విమానాశ్రయంలో ముందుగా పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. తర్వాత  మరో చోట మూడు చమురు ట్యాంకులు పేలినట్లు వెల్లడించారు. ఇందుకు డ్రోన్‌ దాడులే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.


విమానాశ్రయం విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగినట్లు వెల్లడించారు. ఇండస్ట్రీ మస్తఫా ప్రాంతంలో అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన మూడు పెట్రోలియం ట్యాంకర్లపైనా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. ఎగిరే చిన్న వస్తువులు పడిన తర్వాత చమురు ట్యాంకులు పేలినట్లు పోలీసులు వివరించారు. 


ఎందుకు?


యూఏఈపై దాడులు చేసినట్లు హౌతీ సంస్థ ప్రకటించింది. యెమన్‌లో ఇరాన్‌ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో సౌదీ నేతృత్వంలో 2015 నుంచి యూఏఈ యుద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా హౌతీ సంస్థ లక్ష్యంగా చేసుకుంది.


ఇండియన్ ఎంబసీ..






డ్రోన్ దాడుల గురించి తెలుసుకున్న వెంటనే యూఏఈలోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో మాట్లాడింది. మృతుల్లో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు ఇండియన్ ఎంబసీ ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది.