ABP Southern Rising Summit 2025 Annamalai Comments:   తమిళనాడు రాజకీయాలు  యుద్ధభూమి అని, అందుకే దూకుడు శైలి అనివార్యమని అన్నామలై స్పష్టం చేశారు. “నేను దూకుడుగా ఉండటం వల్ల మూల్యం చెల్లించాను, కానీ పార్టీని నిర్మించగలిగాను అని సంతృప్తి వ్యక్తం చేశారు.  రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం  పార్టీ నిర్ణయం  అని, అది తన దూకుడుకు సంబంధించినదే అయినా స్వీకరించానన్నారు. చెన్నైలో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ABP న్యూస్ సీనియర్ పొలిటికల్ ఎడిటర్ మేఘా ప్రసాద్ జరిపిన చర్చలో చాలా విషయాలు పంచుకున్నారు. 

Continues below advertisement

ప్రధానమంత్రి మోడీ స్వయంగా  బరువు తగ్గమని సూచించారని..దాన్ని మిషన్‌గా తీసుకుని 10-12 కేజీలు తగ్గిన విషయాన్ని అన్నామలై గర్వంగా పంచుకున్నారు. 2026 అక్టోబర్‌లో ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్  3.8 కి.మీ స్విమ్మింగ్ + 180 కి.మీ సైక్లింగ్ + 42 కి.మీ రన్నింగ్  పూర్తి చేయడం తన తదుపరి లక్ష్యమని ప్రకటించారు. అన్నాడీఎంకే సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయని, కానీ ఎన్నికల సమయంలో గౌరవప్రదమైన సహచరులుగా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.  NEP, మూడు భాషల సూత్రం వంటి అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం నోరు మూసుకుని కూటమి ధర్మాన్ని పాటిస్తున్నట్టు తెలిపారు.  రాజకీయాలు  నేర్పించిన పాఠం ఏమిటంటే, కొన్నిసార్లు నేను నోరు మూసుకుని ఉండాలని ఆయన సెటైరిక్ గా స్పందించారు. 

2024 లోక్‌సభ ఫలితాల్లో  ఒక్క సీటు కూడా రాలేదన్న విమర్శలకు  అన్నామలై “చైనీస్ బాంబూ చెట్టు” ఉదాహరణ ఇచ్చారు.  90 రోజులు ఏమీ కనిపించదు, 91వ రోజు ఒక్కసారిగా 4 సెం.మీ పెరుగుతుందన్నారు.  కోయంబత్తూరులో 34 శాతం ఓట్లు, 5 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని, 2009తో పోలిస్తే భారీ ప్రగతి అని  స్పష్టం చేశారు.  2026, 2029లో మంచి ఫలితాలు కనిపిస్తాయని అని ధీమా వ్యక్తం చేశారు.

Continues below advertisement

DMK హిందీ వ్యతిరేకత, సంస్కృతాన్ని చచ్చిన భాష  అనడం, ఉత్తర భారతీయులను అవమానించే ప్రకటనలను  అన్నామలై తీవ్రంగా ఖండించారు.  NEP మాతృభాషలో ప్రాథమిక విద్యను తప్పనిసరి చేసిందని, తమిళ యువత బహుళ భాషలు నేర్చుకోవాలని కోరుకుంటోందని వాదించారు. తమిళ గర్వం – భారతీయ గర్వం రెండూ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు బీజేపీలో  బ్రాహ్మణ vs బ్రాహ్మణేతర లాబీ ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. గతంలో భయంకరమైన వివక్షను   తమిళనాడు బ్రాహ్మణులు  ఎదుర్కొన్న సమాజమని, తాను అన్ని కులాలనూ కలుపుకుని పార్టీని అందరిదీ చేయాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. 

  నటుడు విజయ్ రాజకీయ ప్రవేశాన్ని సాధికారికంగా స్వాగతించారు. మూడవ గొంతుక అవసరం, విజయ్ లాంటి వ్యక్తులు తమిళనాడు రాజకీయాలకు మంచిదేనని వ్యాఖ్యానించారు. NDAలోకి రావాలని ఒత్తిడి లేదు ఎన్నికల్లో చూసుకుందాం అని సవాల్ విసిరారు. ప్రజలకు అన్నామలై ఒకటే సందేశం ఇచ్చారు. భావోద్వేగాలకు లొంగకండి – ఆర్థిక వ్యవస్థ, శాంతి భద్రతలు, యువత ఉపాధి, రాష్ట్ర భవిష్యత్తును చూసి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.  బీజేపికి, NDAకి, మా కూటమికి ఒక్క అవకాశం ఇవ్వండి – 5 సంవత్సరాల్లో తేడా చూపిస్తామన్నారు.