Ram Mandir Opening:



32 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ 


సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1992 జనవరి 14వ తేదీన నరేంద్ర మోదీ అయోధ్యలోని రామ జన్మభూమిని (Ayodhya Ram Mandir Opening) సందర్శించుకున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ చేపట్టిన Ekta Yatra లో పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అదిగో ఆ సమయంలోనే ఆయనో ప్రతిజ్ఞ చేశారు. రామ మందిరం కట్టిన తరవాతే మళ్లీ ఇక్కడ అడుగు పెడతానని. జర్నలిస్ట్‌ల సమక్షంలోనే ఈ శపథం చేశారు. మూడు దశాబ్దాల క్రితం పంతం ఇది. ఇన్నాళ్లకు ఆయన దాన్ని నిలబెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఇక్కడ అడుగు పెట్టనున్నారు. అది కూడా ప్రధాని హోదాలో. దాదాపు 500 ఏళ్లుగా దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ మహత్తర ఘట్టం ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరగనుంది. జనవరి 22న బాల రాముడి విగ్రహానికి ఆయనే ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. ఈ క్రమంలోనే మోదీ 32 ఏళ్ల క్రితం చేసిన పంతాన్ని నెగ్గించుకున్నారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్ట్‌లు పెడుతున్నారు. మోదీ ఏక్తా యాత్రలో భాగంగా అయోధ్యకి వెళ్లినప్పటి  ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 



టెంట్‌లో ఉన్న రాముడు..


ఏక్తా యాత్ర సమయంలో మోదీ అయోధ్యకి వెళ్లినప్పుడు రామ్‌లల్లా ఓ టెంట్‌లో ఉన్నాడు. ఆ రాముడిని దర్శనం చేసుకున్న మోదీ చాలా సేపు అలాగే ఉండిపోయారు. కాసేపు తాదాత్మ్యంలో మునిగిపోయారు. ఆ తరవాత బయటకు వచ్చారు. ఆ సమయంలోనే కొందరు జర్నలిస్ట్‌లు ఆయనను రకరకాల ప్రశ్నలు అడిగారు. "మళ్లీ అయోధ్య వస్తారా" అని ప్రశ్నించారు. అందుకు నరేంద్ర మోదీ "రాముడికి గుడి కట్టిన తరవాతే ఇక్కడ అడుగు పెడతాను" అని తేల్చి చెప్పారు. 1992లో మురళీ మనోహర్‌ జోషితో కలిసి ఏక్తా యాత్రలో పాల్గొన్నారు నరేంద్ర మోదీ. అప్పటికి మురళీ మనోహర్ జోషి గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. 1998లో మారిషస్‌లో జరిగిన International Ramayana Conferenceలో మోదీ రామ మందిరం గురించి చాలా భావోద్వేగంగా ప్రసంగించారు. అక్కడ ఆలయం కట్టడం తన జీవితాశయం అని చెప్పారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండడం ఆసక్తి కలిగిస్తోంది.  


ఈ నెల 22వ తేదీన అయోధ్య ఉత్సవాన్ని (Ram Mandir Inauguration) వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు ముందుగా దాదాపు 11 రోజుల పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ క్రమంలోనే "అనుష్ఠానం" కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Ram Mandir Pran Pratishtha) ప్రారంభించారు. ఈ మేరకు స్వయంగా మోదీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో వాయిస్‌ మెసేజ్‌ని అప్‌లోడ్ చేశారు. ఇలాంటి గొప్ప ఉత్సవాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇదో చారిత్రక ఘటన (Ayodhya News) అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని కోరారు. 


"అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మరో 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ వేడుకను నా చేతుల మీదుగా జరగాలనే ఆ దేవుడు నాకీ జన్మ ఇచ్చినట్టున్నాడు. దేశ ప్రజలందరికీ ప్రతినిధిగా నేనీ ప్రాణప్రతిష్ఠ చేస్తాను. ఇవాళ్టి నుంచి 11 రోజుల పాటు పలు కీలక కార్యక్రమాలు జరుగుతాయి. అసలు ఈ ఘట్టాన్ని తలుచుకుంటేనే నేను భావోద్వేగానికి లోనవుతున్నాను. నా జీవితంలో ఇలాంటి అనుభూతి కలగడం ఇదే తొలిసారి"


- ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: పంచెకట్టు నల్లకోటుతో ప్రధాని మోదీ సంక్రాంతి వేడుకలు, వీడియో వైరల్