Indian Students Deported: 



21 మంది తిరుగు ప్రయాణం..


ఎన్నో కలలతో అమెరికాలో అడుగు పెట్టిన 21 మంది భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చింది అగ్రరాజ్యం. ఒకే రోజులో వీళ్లందరినీ తిరిగి ఇండియాకి పంపించేసింది. వీసా ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని అమెరికాకు వెళ్లారు. వెళ్లీ వెళ్లగానే వెనక్కి పంపారు. వాళ్ల డాక్యుమెంట్స్‌ని పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు..అవి సక్రమంగా లేవని కారణం చెబుతూ అటు నుంచే అటే పంపేశారు. అట్లాంటా, చికాగో, శాన్‌ ఫ్రాన్సిస్కోకి వెళ్లిన వాళ్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. అయితే...తమను ఎందుకు వెనక్కి పంపుతున్నారో అన్న క్లారిటీ లేదని, అందుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అంటున్నారు విద్యార్థులు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వీసా డాక్యుమెంటేషన్ కూడా పూర్తైందని చెప్పారు. తమ ఫోన్‌లు లాక్కుని చెక్ చేశారని, వాట్సాప్ చాట్‌ని కూడా చెక్ చేసి వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారని వివరించారు. మరో కీలక విషయం ఏంటంటే...సైలెంట్‌గా వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారట. ఎవరి అరిచి గొడవ చేసినా లీగల్ యాక్షన్ తీసుకుంటామని బెదిరించినట్టూ చెప్పారు విద్యార్థులు. ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వచ్చేశారు. ఈ కారణంగా తమకు సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. అమెరికా రూల్స్ ప్రకారం...ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా వచ్చి డిటైన్ అయితే..మరో ఐదేళ్ల వరకూ ఆ దేశంలో అడుగు పెట్టే అవకాశం ఉండదు. ఇదే ఈ విద్యార్థులను కలవర పెడుతోంది. 


భారీగా వీసాల జారీ..


వీసాల విషయంలో ఇన్నాళ్లు ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తోంది అగ్రరాజ్యం. ముఖ్యంగా భారతీయులకు వీసాలు జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని గుర్తించిన అధికారులు ఆ గడువుని తగ్గించే పనిలో పడ్డారు. ఇప్పటికే అమెరికా ఈ విషయంలో హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో భారతీయులకు దాదాపు 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. స్టూడెంట్ వీసాలు ఇవ్వడంలో ఇకపై ఎలాంటి ఆలస్యం ఉండకుండా చూస్తోంది బైడెన్ యంత్రాంగం. పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమెరికాకు చెందిన ఓ ప్రతినిధి ఈ విషయం వెల్లడించారు. H-1Bతో L వీసాలకూ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగులకు కీలకమైన వీసాలు ఎక్కువగా జారీ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని భావిస్తోంది అగ్రరాజ్యం. H-1B..ఓ నాన్ ఇమిగ్రెంట్ వీసా. అమెరికన్ కంపెనీలు విదేశాల్లోని ఉద్యోగులను రప్పించుకోవాలంటే ఈ వీసాలు తప్పనిసరి. టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్లకే ప్రాధాన్యతనిస్తారు. భారత్ నుంచే కాకుండా చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ని కూడా అమెరికన్ కంపెనీలు భారీ సంఖ్యలో నియమించుకుంటున్నాయి. స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచుతున్నట్టు ఇప్పటికే అమెరికా ప్రకటించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల అప్లికేషన్ ఫీజు పెంచడం వల్ల అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఆ మేరకు ఖర్చు పెరగనుంది.


Also Read: దేశంలోని తొలి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం, 45 రోజుల్లోనే పూర్తి చేసిన రోబోలు