కమెడియన్ సత్యను హీరోగా పరిచయం చేస్తూ హీరో సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రంలో సందీప్ అతిథి పాత్రలో కనిపించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శుక్రవారం (ఆగస్టు 27న) నుంచి ‘Sony Liv’ ఓటీటీలో తొలి తెలుగు చిత్రంగా ‘వివాహ భోజనంబు’ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల చేశారు. ‘లాక్‌డౌన్’ కష్టాలను కామెడీతో చెప్పేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా? సత్య హీరోగా మెప్పించాడా? లేదా అనేది చూద్దాం. 


కథ: మహేష్ (సత్య) అనాథ. ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. డబ్బులు ఖర్చు చేయాలంటే ప్రాణం పోయినట్లుగా ఫీలయ్యేంత పిసినారి. అలాంటిది అతడు గొప్పింటి కుటుంబానికి చెందిన అనిత(ఆర్జవీ)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలిసి అనిత తండ్రి రామకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్).. తన కూతురు మహేష్‌ను ఎలా ప్రేమించిందా అని ఆశ్చర్యపోతాడు. కూతురిపై ఉన్న ప్రేమతో అయిష్టంగా మహేష్‌తో పెళ్లికి అంగీకరిస్తాడు. పెళ్లి తర్వాత మహేష్ అనాథ అని తెలుస్తుంది. దీంతో రామకృష్ణ అతడిని శత్రువును చూసినట్లు చూస్తాడు. పెళ్లి తర్వాత అనిత కుటుంబ సభ్యులు మహేష్ ఇంటికి వస్తారు. అదే సమయంలో కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ విధిస్తారు. దీంతో అనిత కుటుంబ సభ్యులంతా మహేష్ ఇంట్లోనే చిక్కుకుపోతారు. అప్పటి నుంచి పిసినారి మహేష్‌కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? వారిని వదిలించుకోడానికి మహేష్ ఏం చేశాడు? చివరికి రామకృష్ణను మహేష్ మెప్పిస్తాడా? ఇందులో సందీప్ కిషన్ పాత్ర ఏమిటనేది సినిమాలోనే చూడాలి. 


విశ్లేషణ: మహేష్, అనితల ప్రేమకథను పెద్దగా సాగదీయకుండా దర్శకుడు రామ్ అబ్బరాజు నేరుగా కథలోకి వచ్చేశాడు. పెళ్లి తర్వాత శోభనానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలను వినోదాత్మకంగా మలిచారు. అక్కడి నుంచి నవ్వుల విందు మొదలవుతుంది. కరోనా రోజుల్లో ఎదుర్కొన్న ప్రతి సన్నివేశాన్ని ఇందులో వినోదాత్మకంగా చూపించారు. ప్రధాని లాక్‌డౌన్ ప్రకటన నుంచి చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, చివరికి.. ‘పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో’ నినాదం వరకు ప్రతి ఒక్కటీ కామెడీ కోసం వాడేశారు. ఈ సినిమా మొత్తాన్ని సత్య తన భుజాలపైనే మోశాడని చెప్పుకోవాలి. కామెడీతో నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాడు. సత్య వన్ మ్యాన్ షో వల్ల.. హీరోయిన్ ఆర్జవీ పెద్దగా హైలెట్ కాలేదు. ఇందులో సందీప్ కిషన్ అతిథి పాత్రలో కనిపిస్తాడు. నెల్లూరు యాసతో.. వచ్చిరాని ఇంగ్లీషుతో సందీప్ నవ్విస్తాడు. ఆర్జవీకి తండ్రిగా నటించిన శ్రీకాంత్ అయ్యర్ పాత్ర కూడా ఆకట్టుకుంటోంది. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కామెడీ పండించాడు. సుదర్శన్, దయానంద్ రెడ్డి, టీఎన్నాఆర్ తమ పరిధి మేరకు నటించారు.  


ఇక టేకింగ్ పరంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. థియేటర్లో చూస్తే బాగుండేదనే ఫీల్ ప్రేక్షకుడికి కలుగుతుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ, అనివీ అందించిన సంగీతం ప్రేక్షకులను మెప్పిస్తుంది. మొత్తానికి ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కింది. కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగేలా క్లీన్ కామెడీతో ఈ సినిమాను తెరకెక్కించారు. సత్య అందించే నవ్వుల ట్రీట్మెంట్‌కు అంతా కరోనా కష్టాలను మరిచిపోతారు. సినిమాలో అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నా.. అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ, డైలాగులు, కొన్ని సీన్లను మరింత రక్తికట్టించేలా తీస్తే బాగుండేదని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. కరోనా వంటి సెన్సటివ్ విషయాన్ని కామెడీగా చెప్పలంటే సవాలుతో కూడుకున్నదే. ఈ విషయంలో కథా రచయిత భాను, దర్శకుడు రామ్ అబ్బరాజు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. నిర్మాతగా సందీప్ కిషన్‌కు ఇది మంచి చిత్రంగా నిలిచిపోతుంది. హాయిగా నవ్వుకోడానికి, మాంచి టైంపాస్ కోసం ఈ సినిమాను చూడవచ్చు. మొత్తానికి ‘వివాహ భోజనం’ కామెడీతో కడుపు నిండేలా నవ్విస్తుంది. 


నటీనటులు: సందీప్ కిషన్, సత్య, ఆర్జావీ, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్నాఆర్, దయానంద్ రెడ్డి, వైవా హర్ష తదితరులు
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
కథ: భాను భోగవరపు
నిర్మాత: కేఎస్ సినీష్, సందీప్ కిషన్
మ్యూజిక్: అనివీ బ్యానర్స్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
సినిమాటోగ్రఫి: ఎస్ మణికందన్
ఓటీటీ: Sony Liv


గమనిక : ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.


Also Read: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ: సీసా పాతదే.. సరుకే కొత్తది!


Also Read: ఇచ్చట వాహనములు నిలుపరాదు రివ్యూ: సుశాంత్‌కు హ్యాట్రిక్ మిస్?