ఇక్కడ కనిపిస్తున్నది నీడ కాదు, మనిషే. వాస్తవానికి ఇతడు తెల్లగా మల్లెపువ్వులా ఉంటాడు. మరి ఇతడికి ఏమైంది? ఇంత నల్లగా మారిపోయాడేంటీ? ఏ ప్రొడక్ట్ వాడాడు? అనేగా మీ సందేహం. అస్సలు ఆందోళన వద్దు. ఇతడు ఇలా మారిపోవడానికి కారణం ‘వ్యూస్’ పిచ్చి. ఔనండి, ఇతడు ఒక యూట్యూబర్. సో, మీకు మేటర్ అర్థమైపోయే ఉంటుంది. 


ఇతడి పేరు హజీమ్. జపాన్‌ లో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్. ఇతడు చేసే రకరకాల వింత పనులు జపనీయులను బాగా ఆకట్టుకుంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేసి.. సదరు వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటాడు. ఇతడి వీడియోలను జపనీయులు ఎగబడి మరీ చూస్తుంటారు. ఇతడు పోస్ట్ చేసే ప్రతి వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత నల్లదైన పెయింటింగ్ ను ఒంటికి పూసుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆయన ఫాలోవర్లు అవాక్కయ్యారు.


ముసౌ బ్లాక్, ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని పెయింట్ గా గుర్తింపు పొందింది. కొయో ఓరియంట్ జపాన్ అనే సంస్థ ఈ పెయింట్ ను  అభివృద్ధి చేసి విక్రయిస్తోంది. ఈ పెయింట్ ను ఎక్కడ పూసినా.. 99.965% వరకు కనిపించే కాంతిని గ్రహించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మొత్తంగా అద్భుతమైన నల్లటి పూతగా చెప్పుకోవచ్చు. ఈ పెయింట్ అత్యంత ఖరీదైనది కూడా. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో ఈ పెయింట్ అందుబాటులో లేదు. కేవలం అమెజాన్ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో మాత్రమే లభిస్తుంది. 100ml పెయింట్ ఖరీదు ఏకంగా  $17 (సుమారు రూ.1400) ధర పలుకుతోంది. 


తరుచుగా వెర్రీ ఆలోచనలతో వింత పనులు చేసే జపనీస్ వ్లాగర్ హజీమ్..  ఇటీవల బ్లాక్ ముసౌ పెయింట్‌ ను ఉపయోగించి ప్రపంచంలోని అత్యంత నల్లని గదిని సృష్టించాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఓ రూంకు నల్లటి రంగు వేశాడు. ఆ తర్వాత తన మిత్రుడి కళ్లు మూసి ఆ రూంలోకి తీసుకెళ్లాడు. అతడు ఈ నల్లటి గదిని చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో ఇతరులు తనను చీకటిలో చూడగలుగుతారా? అని తెలుసుకునేందుకు తనకు తానుగా ముసౌ బ్లాక్ పెయింట్ ను ఒంటికి రాసుకుంటాడు. చీకటిలో ఉన్న హజీమ్ ను తన స్నేహితుడు కూడా గుర్తించలేకపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశాడు. ఈ యూట్యూబ్ వీడియోకు పెద్ద సంఖ్యలో వ్యూస్  వచ్చాయి. అటు ఒంటికి వేసుకున్న నల్లటి రంగును అలాగే ఉంచుకుని మిట్ట మధ్యాహ్నం సమయంలో స్థానిక బీచ్ కు వెళ్లాడు. నల్లటి రంగుతో అతడి రూపం కేవలం నీడ మాదిరిగానే కనిపిస్తుంది. ఆ ఫోటోలను తను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలను చూసి అతడి ఫాలోవర్స్ తో పాటు నెటిజన్లు షాక్ అయ్యారు.





వాస్తవానికి ముసౌ బ్లాక్ అనే చాలా క్రితం అందుబాటులోకి వచ్చింది. ఇది కార్ల నుంచి పండ్ల వరకు అన్ని రకాల వస్తువులను పెయింట్ చేయడానికి ఉపయోగించబడేది. తొలిసారి అజీమ్ దానిని ఒంటికి పూసుకున్నాడు. ఈ రంగు స్కిన్ కాంటాక్ట్‌ ను పూర్తిగా నివారిస్తుంది. కానీ, అందుకు విరుద్ధంగా హజీమ్ మాత్రం కొంత మేర కనిపించడం విశేషం. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు.. వెర్రి వెయ్యి రకాలు అంటే ఇదే! అని నవ్వుకుంటున్నారు.  






Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!


Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే