బరువు పెరిగితే ఆరోగ్యం చెడిపోతుందనే విషయం మనకు తెలిసిందే. కానీ, బరువు తగ్గడం కోసం అతిగా డైటింగ్ చేస్తే మాత్రం తిప్పలు తప్పవు. బరువు తగ్గింకోడానికి వ్యాయామం, యోగా, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను అలవరచుకోవడం ఒక్కటే సరైన మార్గం. అలా కాకుండా కడుపు మాడ్చుకుని బరువు తగ్గిపోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఈ మహిళ తరహాలోనే చిక్కుల్లో పడతారు. బాగా చిక్కిపోయి అస్థిపంజరంలా మారిపోతారు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే మీరు చైనాకు చెందిన ఈ మహిళ గురించి తెలుసుకోవాల్సిందే.
చైనాలోని హెబీ ప్రావిన్స్కు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ(పేరు వెల్లడించలేదు) కేవలం ఏడాది వ్యవధిలోనే 40 కిలోల బరువు కోల్పోయింది. రెండవ బిడ్డను ప్రసవించిన తర్వాత, ఆమె బరువు 65 కేజీలకు చేరుకుంది. దీంతో ఆమె డైటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఏడాదిలోనే ఆమె తన శరీర బరువును సగానికి పైగా కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో హెంగ్షుయ్ నగరంలోని ఓ ఆసుపత్రికి వెళ్లింది.
25 కేజీల బరువుతో.. నడుస్తున్న అస్థిపంజరాన్ని తలపించేలా ఉన్న ఆమెను చూసి వైద్యులు షాకయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమె ‘అనోరెక్సియా నెర్వోసా’ అనే తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకున్నారు. ఇది కేవలం ఆహారపు అలావాట్ల వల్ల ఏర్పడే వ్యాధి. అప్పటికే ఆమె ఆరోగ్యంపై ఆ వ్యాధి తీవ్ర ప్రభావం చూపింది. ఈ వ్యాధి వల్ల ఆమె అవయవాలు దాదాపు పనిచేయడం మానేశాయి. జుట్టు రాలడం, జీర్ణాశయం, గుండె సమస్యలతో బాధపడుతోంది. రుతుక్రమం ఆగిపోయింది.
Also Read: పెరుగు తింటే నిద్ర ఎందుకు వస్తుంది? రాత్రి వేళ తినకూడదా?
Also Read: ‘మౌత్-హ్యాండ్-ఫుట్’ డిసీజ్: ఒకేసారి పాదాలు, చేతులు, నోటికి వచ్చే ఈ వ్యాధితో జాగ్రత్త, లక్షణాలివే!